1% నికి తగ్గిన కొవిడ్ పాజిటివిటీ రేటు

1% నికి తగ్గిన కొవిడ్ పాజిటివిటీ రేటు

వరంగల్ టైమ్స్, ఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి క్రమంగా అదుపులోకి వస్తోంది. రోజువారీ కేసుల్లో గణనీయమైన తగ్గుదల కనిపిస్తోంది. తాజాగా కొత్త కేసులు 10 వేలకు దిగిరావడం ఊరట కల్గిస్తోంది. మరోవైపు మరణాలు కూడా 250లోపే నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం..గడిచిన 24 గంటల్లో 10,22,204 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 10,273 కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. కొత్త కేసులు తగ్గుతుండటంతో రోజువారీ పాజిటివిటీ రేటు 1 శాతానికి దిగి వచ్చింది.

1% నికి తగ్గిన కొవిడ్ పాజిటివిటీ రేటు

ఇక నిన్న 243 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోగా, ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 5,13,724కు చేరింది. గత కొన్ని రోజులుగా కొత్త కేసుల కంటే రికవరీలే ఎక్కువగా నమోదవుతుండటం సానుకూలాంశం. నిన్న 20,439 మంది వైరస్ నుంచి కోలుకోగా, ఇప్పటి వరకు కరోనాను జయించిన వారి సంఖ్య 4.22 కోట్లు దాటింది. ఆ రేటు 98.54 శాతానికి చేరింది. ప్రస్తుతం క్రియాశీల కేసుల సంఖ్య 1,11,472 కు తగ్గి, ఆ రేటు 0.26 శాతానికి క్షీణించింది. ఇక నిన్న 24,05,049 మందికి టీకాలు వేశారు. దీంతో ఇప్పటి వరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 177 కోట్లు దాటింది.