ఓటు వేయనివారిపై సీపీ సజ్జనార్ కీలక వ్యాఖ్యలు

 

హైదరాబాద్​ : గ్రేటర్​ ఎన్నికల్లో పోలింగ్ శాతం తగ్గడంపై సీపీ సీరియస్ అయ్యారు. ఓటు వేసిన వారిని వేయనవారిని వేర్వేరుగా ట్రీట్ చేయాలని సైబరాబాద్ సీపీ సజ్జనార్ కీలక వ్యాఖ్యలు చేశారు. పోలింగ్ శాతం తగ్గడం బాధాకరమన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో కేవలం 30 నుంచి 35 శాతం పోలింగ్ శాతం అవడం బాధాకరమన్నారు. కోట్లు ఖర్చు పెట్టి ప్రజల సొమ్ముతో ఎన్నికలు నిర్వహిస్తారని తెలిపారు. ఓటు వేయనివారిపై సీపీ సజ్జనార్ కీలక వ్యాఖ్యలు

ఓటు వేసిన వారికి ప్రోత్సాహకాలు అందించాలన్నారు. మరోవైపు ఓటు వేయని వారికి పథకాలు ఇవ్వకుండా , విద్యార్థులు సీట్లు పొందకుండా నిబంధనలు పెట్టాలన్నారు. జాబ్‌ అవకాశాలు విషయంలో కూడా ఈ వ్యతాసం చూపించాలన్నారు. దీనిపై యంత్రాంగంతో పాటు, ఎన్నికల కమిషన్ కూడా ఆలోచించాలన్నారు. రాజకీయ పార్టీలు, సీనియర్ ఐపీఎస్ అధికారులతో కమిటీ వేసి ఓ నిర్ణయం తీసుకుంటే బావుంటుందని పేర్కొన్నారు. ఓటు హక్కుపై ఈసీ మరింత అవగాహన కల్పించాలన్నారు. ఎన్నికల సందర్భంగా పలు ప్రాంతాల్లో పర్యటించామని ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదన్నారు. పోలింగ్ శాతం తగ్గడంపై రాజకీయ నిపుణులు సైతం అసహనం వ్యక్తంచేస్తున్నారు. యువత ఓట్లు వేయకపోవడం చాలా బాధాకరమన్నారు. ఐటీ సెక్టార్ వాళ్లు సెలవులు వస్తే వెళ్లిపోతున్నారని ఆరోపించారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడానికి, మీడియా ముందు చర్చల్లో మాట్లాడటానికి చదువుకున్నవాళ్లు ఆసక్తి చూపుతున్నారని ఓటు వేసేందుకు మాత్రం ముందుకు రావడం లేదన్నారు. 2009లో 45. 27 శాతం, 2014లో 50.86 శాతం పోలింగ్ నమోదైందన్నారు.