రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించిన డీజీపీ
వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను డీజీపీ మహేందర్ రెడ్డి ఖండించారు. ప్రభుత్వం తనను బలవంతంగా సెలవుపై పంపించిందంటూ ఆయన చేసిన ఆరోపణలను డీజీపీ ఆక్షేపించారు. ఇంట్లో కింద పడటం వల్ల ఎడమ చేతి భుజానికి గాయమైందని తెలిపారు. వైద్యులు పూర్తి విశ్రాంతి అవసరమని చెప్పడంతో ఫిబ్రవరి 18 నుంచి మార్చి 4వరకు సెలవు పెట్టనన్నారు. వారు సూచించిన విధంగా ఫిజియోథెరపీతో పాటు మందులు వాడుతున్నానని డీజీపీ వెల్లడించారు. తనపై బాధ్యతారహిత ప్రచారం చేయడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రభుత్వ అధికారులను పావుగా వాడుకోవడం తగదన్నారు. తప్పుడు ఆరోపణలు చేసి పోలీసు శాఖ స్థైర్యాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని ఆక్షేపించారు. ఇలాంటి వ్యాఖ్యలతో రాష్ట్ర ప్రజలకు నష్టం కలిగే ప్రమాదముందన్నారు. ఈ తరహా వ్యాఖ్యలు చేయకుండా సంయమనం పాటించాలని డీజీపీ మహేందర్ రెడ్డి కోరారు.