నిశ్చితార్థం చేసుకున్న సింగర్

నిశ్చితార్థం చేసుకున్న సింగర్హైదరాబాద్: గాయని సునీత మరోసారి వివాహబంధంలోకి అడుగుపెట్టనున్నారు. ప్రముఖ వ్యాపారవేత్త రామ్ వీరపునేనిని ఆమె పెళ్లి చేసుకోనున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో సునీత-రామ్ ల నిశ్చితార్థం వేడుకగా జరిగింది. నిశ్చితార్థం గురించి తెలియచేస్తూ తాజాగా సునీత ఫేస్ బుక్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. ప్రతీ తల్లిలాగానే నేను కూడా నా పిల్లలు చక్కగా జీవితాల్లో స్థిరపడాలని కోరుకుంటున్నాను. అదే సమయంలో నేనూ జీవితంలో సంతోషంగా స్థిరపడాలని ఆశించే అందమైన తల్లిదండ్రులు, పిల్లలు నాకున్నందుకు ఎంతో సంతోషిస్తున్నా.. నా జీవితంలో అలాంటి మధురక్షణం ఆసన్నమైంది. సంరక్షించే స్నేహితుడిగా…అద్భుతమైన సహచరుడిగడా రామ్ నా జీవితంలోకి ప్రవేశించాడు. మేమిద్దరం అతి త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నాం. నా వ్యక్తిగత జీవితాన్ని గోప్యంగా ఉంచానని అర్థం చేసుకున్న వారందరికీ కృతజ్ఞతలు. ఎప్పటికీ నన్ను సపోర్ట్ చేయాలని ఆశిస్తున్నా అని సునీత పేర్కొన్నారు. సునీతకు 19 ఏళ్ల వయసులోనే పెళ్లి కాగా, భర్తతో విభేదాల కారణంగా చాలా ఏళ్లుగా ఆయనకు ఆమె దూరంగా ఉన్నారు. చివరకు విడాకులు తీసుకొని ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు. సునీతే తన పిల్లల సంరక్షణ బాధ్యతలు చూసుకుంటున్నారు. నిశ్చితార్థం చేసుకున్న సింగర్సునీతకు కాబోయే భర్త రామ్ వీరపనేనికి కూడా రెండో వివాహ‌మే. తెలుగమ్మాయి అయిన సునీత గాయనిగా చిత్రపరిశ్రలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. గులాబీ సినిమాలో  ‘ఈ వేళలో నీవూ’.. అంటూ పాటతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇప్పటి వరకు దాదాపు కొన్నివందల పాటలు పాడారు. ‘మురారి’, ‘తమ్ముడు’, ‘ఊహలు గుసగుసలాడే’, ‘నేనున్నాను’ , ‘బాస్’ , ‘మహానటి’…ఇలా ఎన్నో చిత్రాలకు ఆమె పాటలు పాడి ప్రేక్షకులను అలరించారు. ఇటీవల ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా’? చిత్రం కోసం సునీత పాడిన నీలి నీలి ఆకాశం పాట ప్రేక్షకులను బాగా ఆకర్షించింది. గాయనిగానే కాకుండా ఆమె డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా అలరించారు.