ప్రియుడి చేతిలో ప్రియురాలి దారుణ హత్య

ప్రియుడి చేతిలో ప్రియురాలి దారుణ హత్య

వరంగల్ టైమ్స్, తూర్పుగోదావరి జిల్లా : బెంగళూరులో కాకినాడ యువతి దారుణ హత్యకు గురైంది. 16సార్లు కత్తితో పొడిచి అతి కిరాతకంగా ప్రియురాలిని హతమార్యాడు ప్రియుడు. కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం కాకినాడకు చెందిన యువతి లీలా పవిత్ర (28)దారుణ హత్యకు గురైంది. తనను దూరం పెట్టి వేరే వ్యక్తితో పెళ్లికి సిద్ధమైందన్న కోపంతో ఆమె ప్రియుడు అత్యంత కిరాతంగా ఆమెను పొడిచి చంపేశాడు. బెంగళూరు నగరంలోని జీవనబీమా నగర పోలీసు స్టేషన్‌ పరిధిలో మంగళవారం రాత్రి 7.45 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది.ప్రియుడి చేతిలో ప్రియురాలి దారుణ హత్యపోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
లీలా పవిత్ర స్వస్థలం కాకినాడ. ఉద్యోగం నిమిత్తం బెంగళూరు వెళ్లి దొమ్లూర్‌లోని ఓ ప్రైవేటు ల్యాబొరేటరీలో పనిచేస్తోంది. అదే ల్యాబొరేటరీలో ఉద్యోగం చేస్తున్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన దివాకర్‌ అనే వ్యక్తితో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది. గత ఐదేళ్లుగా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు. ఇటీవల వీరి బంధం గురించి లీలా తన ఇంట్లో వాళ్లకు చెప్పగా, పెళ్లికి వారు అంగీకరించలేదు. దీంతో గత రెండు నెలల నుంచి లీలా, దివాకర్‌ను దూరం పెడుతూ వస్తోంది. ఇటీవల ఆమెకు మరో వ్యక్తితో వివాహం నిశ్చయమైందని తెలుసుకున్న ప్రియుడు ఆమెపై కోపం పెంచుకున్నాడు.

మంగళవారం రాత్రి విధులు ముగించుకుని బయటకు వచ్చిన లీలాపై ఆఫీసు బయటే కత్తితో దాడిచేశాడు. సహోద్యోగులు చూస్తుండగానే పలుమార్లు విచక్షణారహితంగా పొడిచాడు. సమాచారమందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని దివాకర్‌ను అరెస్టు చేశారు. ఈ ఘటనతో తీవ్రంగా గాయపడిన లీలాను సమీపంలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఆమె ఒంటిపై 16 చోట్ల కత్తితో పొడిచిన గాయాలున్నట్లు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు బెంగళూరు పోలీసులు వెల్లడించారు.