ఖమ్మం సభలో కేసీఆర్ కీలక వాగ్దానాలు

ఖమ్మం సభలో కేసీఆర్ కీలక వాగ్దానాలు

ఖమ్మం సభలో కేసీఆర్ కీలక వాగ్దానాలువరంగల్ టైమ్స్ ఖమ్మం జిల్లా : బీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే దేశంలో కరెంట్ సమస్యలు పరిష్కరిస్తామని సీఎం కేసీఆర్‌ వాగ్ధానం చేశారు. రెండేళ్లలో వెలుగులు జిలుగుల భారత్‌‌ను నిర్మిస్తామని హామీ ఇచ్చారు. బీఆర్‌ఎస్‌ వస్తే దేశ రైతాంగానికి ఉచిత కరెంట్ ఇస్తామని హామీ ఇచ్చారు. నదీ జలాలతో ప్రజల గొంతు నింపాలని, పొలాలను తడపాలని పేర్కొన్నారు. దీనిని నిజం చేసేందుకే బీఆర్‌ఎస్‌ పుట్టిందని, అవసరమైతే మరో ఉద్యమం తప్పదని అన్నారు. దేశంలో ఇంకా నీటి యుద్ధాలు అవసరమా? అని వ్యాఖ్యానించారు. రాష్ట్రాల మధ్య కేంద్రం కొట్లాటలు పెడుతోందని విమర్శించారు.

దేశంలోని వ్యవస్థలను ప్రైవేటీకరిస్తున్నారని కేంద్రంపై ఆయన మండిపడ్డారు. ఎల్‌ఐసీని ప్రైవేటీకరణను తప్పుబట్టిన ఆయన బీజేపీ సర్కార్ ప్రైవేటీకరిస్తున్న సంస్థలను వెనక్కి తీసుకుంటామని అన్నారు. విద్యుత్ రంగం ప్రైవేట్ సెక్టార్‌లోనే ఉంటుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ‘2024 తర్వాత మీరు ఇంటికి.. మేం ఢిల్లీకి’ అనే నినాదాన్ని సీఎం కేసీఆర్ ఇచ్చారు.

దేశంలో ప్రభలమైన మార్పునకు ఖమ్మం సభ సంకేతమని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఖమ్మం చరిత్రలోనే ఇది అద్భుతమైన సభని అన్నారు. ఈ మేరకు బీఆర్ఎస్ ఖమ్మం భారీ బహిరంగ సభలో కీలక ప్రసంగం చేశారు. తెలంగాణలో ప్రాజెక్టులు శరవేగంగా నిర్మాణం అవుతున్నాయని ప్రస్తావించారు. బీజేపీ, కాంగ్రెస్ దొందుదొందేనని అన్నారు. రాజకీయ విమర్శలు చేస్తూ ప్రజా సమస్యలు వదిలేశారని మండిపడ్డారు.

దేశం దారితప్పి బిత్తరపోయి, గత్తర పోతోందా.. కేసీఆర్.

‘దేశం దారితప్పి.. బిత్తరపోయి గత్తర పోతోందా?. దేశం లక్ష్యాన్ని కోల్పోయిందా.. దారి తప్పిందా? ఈ ప్రశ్నలు నా అంతరాత్మను తొలచివేస్తున్నాయి. ఏ దేశాన్ని చేయి చాపాల్సిన అవసరం లేనంత సంపద మన దేశానికి ఉంది. అయినా ఎందుకు యాచకుడిలా చేయి చాపాలి’’ అని సీఎం కేసీఆర్ అన్నారు. ఏ ప్రపంచ బ్యాంకును అప్పు అడగకుండా, ఏ అమెరికా కాళ్లను మొక్కకుండా బతికేంత వనరులు భారతదేశానికి ఉన్నాయని పేర్కొన్నారు.

దేశంలో 41 కోట్ల ఎకరాలు సాగుకు అనుకూలంగా ఉందని, లక్షా 40 వేల టీఎంసీల వర్షం కురుస్తోందని అన్నారు. ఇందులో 70 వేల టీఎంసీల నీరు ఆవిరైపోతుండగా, ఇంకో 70 వేల టీఎంసీల నీరు అందుబాటులో ఉంటుందని ప్రస్తావించారు. భూమి, నీరు, సూర్యరశ్మి అనుకూలంగా ఉన్న దేశం మనదని, ఎన్నో వనరులు ఉన్నా మనం పిజ్జాలు, బర్గర్లు తినాలా?. కందిపప్పు, పామాయిల్ దిగుమతి చేసుకోవాలా?. నీటి వనరులు ఉన్నా తాగేందుకు విషపు నీరా?. ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తారు. అది ఉలుకూ పలుకూ ఉండదని కేసీఆర్ కేంద్రాన్ని ప్రశ్నించారు.

దేశం తన లక్ష్యాన్ని కోల్పోయిందని వ్యాఖ్యానించారు. మంచినీరు ఇవ్వడం కేంద్రానికి చేతకావడం లేదని విమర్శించారు. నదీ జలాలు సముద్రం పాలవుతుంటే చూస్తూ కూర్చుంటున్నారని మండిపడ్డారు.

ఖమ్మం జిల్లాకు నిధులు ప్రకటన

తుమ్మల నాగేశ్వరరావు, మంత్రి అజయ్ హయంలో ఖమ్మం జిల్లా అభివృద్ధిలో ముందుకెళ్తోందని అన్నారు. ఖమ్మం మునిసిపాలిటీకి రూ.50 కోట్లు నిధులు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. మున్నేరుపై కొత్త బ్రిడ్జీని నిర్మిస్తామని ప్రకటించారు. ఇతర మున్సిపాలిటీలకు తలో రూ.30 కోట్లు మంజూరు చేస్తామని ప్రకటించారు. ఖమ్మం జిల్లాలోని 589 పంచాయతీలకు ప్రతి గ్రామ పంచాయతీకి రూ.10 లక్షల నిధులు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. ఖమ్మం జిల్లాకు ఇంజనీరింగ్ కాలేజీ మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. 10 వేల జనాభా దాటిన మేజర్ పంచాయతీలకు రూ.10 కోట్ల చొప్పున నిధులు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు.

కాగా బీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత నిర్వహించిన తొలి సమావేశమైన ఖమ్మం సభకు గులాబీ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కార్యకర్తలు, నాయకులు భారీగా తరలి వచ్చారు.

ఈ భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్‌తో పాటు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌, పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌, కేరళ సీఎం పినరయి విజయన్‌, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా, యూపీ మాజీ సీఎం అఖిలేష్‌ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు…