లాలూ కు 5 యేళ్ల జైలు శిక్ష

లాలూ కు 5 యేళ్ల జైలు శిక్షవరంగల్ టైమ్స్, రాంచీ : ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కు రాంచీలోని సీబీఐ కోర్టు షాకిచ్చింది. దాణా కుంభకోణానికి సంబంధించిన ఐదో కేసులో ఆయనను కోర్టు దోషిగా తేల్చింది. ఇందుకు ఐదేళ్లు జైలు శిక్ష, రూ.60 లక్షల జరిమానాను విధించింది. ఈకేసుకు సంబంధించి లాలూను గత వారమే కోర్టు దోషిగా నిర్ధారించింది. నేడు శిక్షను ఖరారు చేసింది. 1990లో ఈ కుంభకోణం చోటు చేసుకుంది. డోరండ ట్రెజరీ నుంచి రూ.139.5 కోట్ల ను చట్ట విరుద్ధంగా విత్ డ్రా చేశారనే ఆరోపణలతో ఈ కేసు నమోదైంది.

ఆ టైంలో బీహార్ సీఎంగా లాలూ ప్రసాద్ ఉన్నారు. ప్రస్తుతం లాలూ ప్రసాద్ బెయిల్ పై బయట ఉన్నారు. అనారోగ్య కారణాలతో బాధపడుతున్న ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కోర్టు విచారణకు ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. దాణా కుంభకోణానికి సంబంధించి మరో కేసు పాట్నాలోని సీబీఐ కోర్టులో పెండింగ్ లో ఉంది. భాగల్పూర్ ట్రెజరీ నుంచి అక్రమంగా నిధులను విత్ డ్రా చేశారంటూ ఈ కేసు నమోదయింది.