ఎస్పీ పేరుతో వసూళ్లు.. పరారీలో సీఐ

ఎస్పీ పేరుతో వసూళ్లు.. పరారీలో సీఐ

వరంగల్ టైమ్స్, కర్నూలు జిల్లా: కర్నూలు జిల్లాలో ఓ సీఐ హద్దులు మీరాడు. ఏకంగా ఎస్పీ పేరుతోనే వసూళ్లకు తెగబడ్డాడు. కర్నూలు జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి పేరుతో కర్నూలు తాలూకా అర్బన్ సీఐ కంబగిరి రాముడు అవినీతి చిట్టా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఐపై అదే పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 19న కర్నూలు మండలం పంచలింగాల చెక్ పోస్ట్ వద్ద స్పెషల్ ఎన్ఫోర్స్ మెంట్ బ్యూరో అధికారులు (SEB)హైదరాబాద్ నుంచి తమిళనాడు వెళ్తున్న ఓ బస్ ను తనిఖీ చేశారు. తమిళనాడుకు చెందిన సతీష్ బాలకృష్ణ అనే ప్రయాణికుడు వద్ద రూ.75 లక్షలు గుర్తించారు. స్పెషల్ ఎన్ఫోర్స్ మెంట్ బ్యూరో అధికారులు డబ్బుతో పాటు అతనిని కర్నూలు తాలూకా అర్బన్ పోలీసులకు అప్పగించారు.ఎస్పీ పేరుతో వసూళ్లు.. పరారీలో సీఐపట్టుబడిన నగదుకు సంబంధించిన పత్రాలను అతను పోలీసులకు చూపారు. సీఐ కంబగిరి రాముడు మొత్తం సొమ్ము తిరిగి ఇవ్వకుండా జిల్లా ఎస్పీకి ఇవ్వాలంటూ. రూ 15లక్షలు బలవంతంగా తీసుకున్నారు. అందులో రూ.5 లక్షలు ముగ్గురు మధ్యవర్తులు ఇచ్చారు. రూ.10 లక్షలు తన వద్ద ఉంచుకున్నారు. మిగిలిన రూ.60 లక్షలను సతీష్ బాలకృష్ణకు ఇచ్చారు. దీనిపై బాధితుడు పోలీసు ఉన్నతాధికారులకు తెలిపారు. వీరి ద్వారా విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి సదరు సీఐపై అదే పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పర్చాలని ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేశారు.

సతీష్ బాలకృష్ణ ఫిర్యాదు మేరకు ఎస్సై లక్ష్మీనారాయణ, సీఐతో పాటు ముగ్గురు మధ్యవర్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీఐ విజయవాడకు వెళ్తున్నట్లు తెలుసుకొని అతన్ని అరెస్టు చేసి తీసుకు వచ్చేందుకు జిల్లా రక్షణాధికారి ప్రత్యేక పోలీసు బృందాలను పంపారు. అయితే ఈ విషయం తెలుసుకున్న సీఐ పరారీలో ఉన్నట్లు సమాచారం. ముగ్గురు మధ్యవర్తులను అదుపులోకి తీసుకుని క్షేత్రస్థాయిలో పోలీసులు విచారిస్తున్నారు.