స్వప్నలోక్ కాంప్లెక్స్ ఘటన..ఏడుగురు సేఫ్

స్వప్నలోక్ కాంప్లెక్స్ ఘటన..ఏడుగురు సేఫ్

మృతులంతా 25 యేండ్లలోపే

గాంధీలో ఐదుగురు, ప్రైవేటులో ఒకరు మృతి

ఊపిరి ఆడక చనిపోయినట్టు వైద్యుల నిర్ధారణ

ఏడుగురిని రక్షించిన అగ్నిమాపక సిబ్బంది

హుటాహుటిన ఆస్పత్రులకు తరలింపు

ప్రమాదానికి షార్ట్‌సర్క్యూటే కారణం

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : సికింద్రాబాద్‌లోని స్వప్నలోక్‌ కాంప్లెక్‌లో గురువారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఆరుగురు దుర్మరణం చెందారు. మృతులను ప్రమీల, శ్రావణి, వెన్నెల, త్రివేణి, శివ ప్రశాంత్‌గా గుర్తించారు. వీరంతా 25 యేళ్ల వయస్సులోపు వారే. రద్దీ ప్రాంతంలో ఉన్న స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌లో రాత్రి వేళ 7, 8 అంతస్థుల్లో తొలుత మంటలు చెలరేగాయి.స్వప్నలోక్ కాంప్లెక్స్ ఘటన..ఏడుగురు సేఫ్ఆ తర్వాత 5, 6 అంతస్థులకు మంటలు వ్యాపించాయి. ప్రమాద విషయం తెలియగానే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలను ఆర్పేసే పనిలోకి దిగారు. మంటలు అంటుకున్న ఫ్లోర్లలో ప్రైవేట్‌ కార్యాలయాలు, దుస్తుల గోదాములు ఉన్నాయి. అక్కడ పనిచేసే సిబ్బంది ఇండ్లకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నది. కొందరు హాహాకారాలు చేస్తూ ప్రాణాలతో బయటపడగా, పలువురు మంటల్లో చిక్కుకున్నారు. మంటల తీవ్రత పెరిగే అవకాశం ఉన్నదని భావించిన అధికారులు సమీప నివాసాల్లో ఉన్న వారిని సైతం ఖాళీ చేయించారు.

అగ్నిమాపక శాఖ సిబ్బంది భారీ క్రేన్ల సహాయంతో భవనంలో చిక్కుకున్న మొత్తం 13 మందిని బయటకు తీసుకొచ్చారు. మంటల ధాటికి వచ్చిన పొగతో వీరిలో కొం దరు స్పృహ కోల్పోగా రెస్క్యూ సిబ్బంది సీపీఆర్‌ చేశారు. అనంతరం హుటాహుటిన గాంధీ దవాఖానకు ఐదుగురిని, అపోలో దవాఖానకు ఒకరిని తరలించారు. వీరు దవాఖానల్లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అయితే, వీరంతా ఊపిరి ఆడక చనిపోయినట్టు వైద్యులు పేర్కొన్నారు. నలుగురు యశోద ఆ
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మరో ముగ్గురు సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడ్డారు.

* సహాయ చర్యలను పర్యవేక్షించిన మంత్రులు, అధికారులు
ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే రాష్ట్ర మంత్రులు మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, నగర మేయర్‌ గద్వాల విజయలక్ష్మి, కలెక్టర్‌ , డీసీపీలు చందనా దీప్తి, సుమతిలు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షించారు. నాలుగు గంటలపాటు తీవ్రంగా శ్రమించి అగ్నిమాపక సిబ్బంది రాత్రి 11 గంటల సమయంలో మంటలు అదుపులోకి తెచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే అగ్ని ప్రమాదానికి షార్ట్‌ సర్క్యూట్‌ కారణమని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు.