ఈ నెల 21 నుంచి భూముల రీసర్వే

ఈ నెల 21 నుంచి భూముల రీసర్వే
సర్వే ఆఫ్‌ ఇండియాతో ప్రభుత్వం ఒప్పందం
చరిత్రలో ఇదో సువర్ణాధ్యాయంగా నిలిచిపోతుంద‌న్నసీఎం ‌జ‌గ‌న్ ‘వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు- భూ రక్ష పథకం’పై కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్​‌

ఈ నెల 21 నుంచి భూముల రీసర్వే

అమ‌రావ‌తి: భూముల రీసర్వే ప్ర‌క్రియ విష‌యంలో ఏపీ ప్రభుత్వం, సర్వే ఆఫ్‌ ఇండియా కలిసి సమగ్ర సర్వే చేస్తున్నాయ‌ని ఇది చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోయే కార్యక్రమం అని ఏపీ సీఎం వైఎస్​ జగన్​ అన్నారు. ‘వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు, భూ రక్ష పథకం’పై సర్వే ఆఫ్‌ ఇండియాతో ప్ర‌భుత్వం అవగాహన ఒప్పందం కుద‌ర్చుకున్న అనంత‌రం బుధవారం జిల్లాల కలెక్టర్లతో సీఎం జగన్‌ వీడియో కాన్ఫరెన్స్ నిర్వ‌హించారు. దేశంలోనే తొలిసారిగా ఇంత పెద్ద స్థాయిలో సర్వే చేస్తున్నామన్నారు. ఇంటి స్థలం, పొలం , మరో స్తిరాస్థి ఏదైనా కానివ్వండి దానిమీద ఒక టైటిల్‌ ఇచ్చిన తర్వాత రెండేళ్ల పాటు అబ్జర్వేషన్‌లో అదే గ్రామ సచివాలయంలో పెడతామని తెలిపారు. ఆ టైటిల్‌పై ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని కోరుతామని రెండేళ్ల తర్వాత టైటిల్‌కు శాశ్వత భూహక్కు లభిస్తుందని ఆ మేరకు టైటిల్‌ ఖరారు చేస్తామని సీఎం పేర్కొన్నారు. ఆ తర్వాత కూడా ఏమైనా అభ్యంతరాలు ఉంటే.. ప్రభుత్వమే బాధ్యత తీసుకుని పరిహారం చెల్లిస్తుందన్నారు. 100 ఏళ్ల తర్వాత ఈ సర్వే జరుగుతోందని 100 ఏళ్లలో సబ్‌ డివిజన్లు, పంపకాలు క్షేత్రస్థాయిలో నమోదు కాని పరిస్థితి ఉందన్నారు. వాటన్నింటినీ రికార్డుల్లోకి ఎక్కిస్తాం, రాళ్లు కూడా వేస్తామని పేర్కొన్నారు. తర్వాత యూనిక్‌ ఐడెంటింటీ నంబర్‌తో కార్డు కూడా ఇస్తామని ఆ కార్డులో క్యూర్‌ఆర్‌ కోడ్ ‌ఉంటుందని హార్డ్‌కాపీ కూడా ఇస్తామని తెలిపారు. ల్యాండ్‌ పార్సిళ్లు, మ్యాపులు కూడా గ్రామంలో అందుబాటులో ఉంచుతామని చెప్పారు. రికార్డులన్నింటినీ కూడా డిజిటలైజేషన్‌ చేస్తామని విలేజ్‌ హాబిటేషన్స్‌కు సంబంధించిన మ్యాపులు కూడా అందుబాటులోకి తీసుకొస్తామని వ్యాఖ్యానించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఈ సర్వే రికార్డులు ఉంటాయ‌ని సీఎం జగన్​ తెలిపారు. డిప్యూటీ సీఎం, రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్, సీఎస్‌ నీలం సాహ్ని, సీసీఎల్‌ఏ చీఫ్‌ కమిషనర్‌ నీరబ్‌కుమార్‌ ప్రసాద్, సర్వేయర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా, లెఫ్టినెంట్ జనరల్ గిరీష్‌కుమార్, వివిధ శాఖలకు చెందిన పలువురు ఉన్నతాధికారులు కార్యక్రమంలో పాల్గొనగా, అన్ని జిల్లాల కలెక్టర్లు, జేసీలు వీడియో కాన్ఫరెన్స్​లో పాల్గొన్నారు. భూముల రీసర్వే కచ్చితత్వంతో పూర్తి చేస్తామని సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియా లెఫ్టినెంట్ జనరల్ గిరీష్‌కుమార్ అన్నారు. మొదటి దశలో భాగంగా ఈ నెల 21న రీసర్వే ప్రారంభవుతుందని తెలిపారు. దేశంలోనే మొదటిసారిగా ఏపీలో మాత్రమే రీసర్వే జరగనుందని గిరీష్​కుమార్​ మీడియాతో చెప్పారు. తమతో ఒప్పందం కుదుర్చుకున్నందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఒప్పందంలో భాగంగా ప్రభుత్వానికి సాంకేతిక సహకారం అందిస్తామని అత్యాధునిక కెమెరాలు, డ్రోన్లు వినియోగిస్తున్నామన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ణానంపై 14 వేల మంది సర్వేయర్లకి శిక్షణ ఇవ్వనున్నామన్నారు. రీసర్వే చేసి మేం ఇచ్చే మ్యాపులు అన్ని ప్రభుత్వ శాఖలకు ఉపయోగకరంగా ఉంటాయని పేర్కొన్నారు. మూడు దశల్లో కచ్చితత్వంతో రీసర్వే పూర్తిచేస్తామని చెప్పారు. జాతీయ మ్యాపులు తయారుచేసే ఏజెన్సీగా సర్వేయర్ ఆఫ్ ఇండియా ఉందని రీసర్వే జీపీఎస్ అనుసంధానం చేసిన డ్రోన్‌తో కొనసాగుతుందన్నారు. ఐదు సెంటీమీటర్ల మార్పుతో కచ్చితమైన సర్వే జరుగుతుందన్నారు. తిరుపతిలో ఒక ట్రైనింగ్ అకాడమీ ఏర్పాటు చేస్తాం. ఛార్టర్డ్ సర్వేయర్లను రాబోయే కాలంలో అందించేందుకు ట్రైనింగ్ అకాడమీ ఉంటుంద‌ని గిరీష్‌కుమార్‌ తెలిపారు.