ప్రముఖ సీనియర్ నటుడు ‘బాలయ్య’ ఇకలేరు 

ప్రముఖ సీనియర్ నటుడు ‘బాలయ్య’ ఇకలేరు

వరంగల్ టైమ్స్, సినిమా డెస్క్ : ప్రముఖ సీనియర్ నటుడు, నిర్మాత మన్నవ బాలయ్య శనివారం కన్నుమూశారు. సినీరంగంలో విభిన్న పాత్రలలో నటించి ప్రేక్షకులలో మంచి గుర్తింపు ఏర్పరుచుకున్నాడు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బాలయ్య యూసుఫ్ గూడలోని తన నివాసంలో శనివారం ఉదయం కన్నుమూశాడు. అయితే బాలయ్య పుట్టిన రోజు కూడా ఇదే రోజు.ప్రముఖ సీనియర్ నటుడు 'బాలయ్య' ఇకలేరు 1958లో వచ్చిన ‘ఎత్తుకు పై ఎత్తు’ సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన బాలయ్య ఇప్పటివరకు దాదాపు 300 సినిమాల్లో నటించారు. బాలయ్య నటుడిగానే కాకుండా నిర్మాతగా, రచయితగా, దర్శకుడిగా పలు విభాగాల్లో పనిచేస్తూ సినీ రంగంలో తనదైన ముద్ర వేసుకున్నాడు. అంతేకాకుండా ఆయన రైటర్ గా పనిచేసిన ‘ఊరికిచ్చిన మాట’ సినిమాతో ఉత్తమ కథా రచయితగా నంది అవార్డును అందుకున్నాడు. 1971లో అమృత అనే బ్యానర్ ను స్థాపించి సూపర్ స్టార్ కృష్ణ, శోభన్ బాబు, చిరంజీవి వంటి స్టార్ హీరోల సినిమాలకు బాలయ్య నిర్మాతగా వ్యవహరించాడు.

ఇప్పటి వరకు ఆయన తన బ్యానర్ లో 10 సినిమాలను నిర్మించాడు. క్రిష్ణంరాజు హీరోగా నటించిన ‘నిజం చెబితే నేరమా?’ సినిమాతో బాలయ్య దర్శకుడిగా మెగా ఫోన్ పట్టాడు. ‘పసుపు తాడు’, ‘పోలీస్ అల్లుడు’ వంటి సినిమాలకు దర్శకత్వం వహించాడు. బాలయ్య చివరగా వేణు తొట్టెంపూడి హీరోగా నటించిన ‘రామాచారి’ సినిమాలో సీఎం పాత్రలో నటించాడు.