సీఎం కేసీఆర్ ను ఆహ్వానించిన మహారాష్ట్ర సీఎం

సీఎం కేసీఆర్ ను ఆహ్వానించిన మహారాష్ట్ర సీఎంవరంగల్ టైమ్స్, హైదరాబాద్ : ఈ నెల 20న మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరేతో తెలంగాణ సీఎం కేసీఆర్ బేటీ కానున్నారు. మహారాష్ట్ర సీఎం ఆహ్వానం మేరకు ఈ నెల 20న సీఎం కేసీఆర్ ముంబైకి వెళ్లనున్నారు. ముంబైకి రావాలని, తన ఆతిథ్యాన్ని అందుకోవాలని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే సీఎం కేసిఆర్ ను ఆహ్వానించారు. ఈ మేరకు బుధవారం సీఎం కేసిఆర్ కు ఉద్ధవ్ థాకరే ఫోన్ చేసి, దేశం కోసం కేసీఆర్ చేస్తున్న పోరాటానికి సంపూర్ణ మద్దతు తెలిపారు. బీజేపీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ, ఫెడరల్ న్యాయం కోసం, సీఎం కేసీఆర్ చేస్తున్న పోరాటానికి ఉద్ధవ్ థాకరే తన సంపూర్ణ మద్దతును పలికారు.

“కేసీఆర్ జీ మీరు చాలా గొప్పగా పోరాడుతున్నారు. మీది న్యాయమైన పోరాటం. ఈ దేశాన్ని విభజన శక్తుల నుండి కాపాడుకోవడానికి సరైన సమయంలో మీరు గళం విప్పారు. రాష్ట్రాల హక్కుల కోసం, దేశ సమగ్రతను కాపాడేందుకు మీరు పోరాటం కొనసాగించండి. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగండి. మా మద్దతు మీకు సంపూర్ణంగా వుంటుంది. ఈ దిశగా దేశ ప్రజలందరినీ కూడగట్టేందుకు మా వంతు సహకారాన్ని అందిస్తాం..” అంటూ థాకరే తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అందుకోసమే “మిమ్మల్ని ముంబైకి ఆహ్వానిస్తున్నాను. మీరు మా ఆతిథ్యాన్ని తీసుకోండి. అదే సందర్భంలో ఈ దిశగా భవిష్యత్ కార్యాచరణపై చర్చించుకుందాం..” అని సీఎం కేసీఆర్ ని ఉద్ధవ్ థాకరే ఆహ్వానించారు.