దివ్యాంగ అభిమాని సాహసానికి చలించిన మెగాస్టార్ చిరు

దివ్యాంగ అభిమాని సాహసానికి చలించిన మెగాస్టార్ చిరుహైదరాబాద్ : మెగాస్టార్ చిరంజీవికి అభిమానులు ఉండరు భక్తులే ఉంటారు అని నిరూపించే మరో ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. స్వయంకృషితో ఎదిగి టాలీవుడ్ నెం.1 స్థానానికి చేరిన చిరంజీవి అంటే ప్రాణం ఇచ్చే అభిమానులున్నారనడంలో అతిశయోక్తి ఏమీ లేదు. అలాంటి అభిమానులలో ఒకరైన డెక్కల గంగాధర్ ఎవరూ ఊహించని పని చేశారు.

మెగాస్టార్ చిరును కలిసేందుకు డెక్కల గంగాధర్ అనే ఒక అభిమాని పాదయాత్ర ప్రారంభించారు. తూర్పు గోదావరి జిల్లా అమలాపురం నుంచి హైదరాబాద్ వరకు ఆయన పాదయాత్ర చేస్తూ వచ్చారు. ఉప్పలగుప్తం మండలం కిత్తనచెరువుకు చెందిన డెక్కల గంగాధర్‌ అనే అభిమాని అక్టోబర్ 3న కాలి నడకన హైదరాబాద్‌ బయలు దేరాడు.

మెగాస్టార్ చిరంజీవి నటించిన మాస్టర్‌ సినిమా విడుదలై 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా చిరంజీవిని చూడాలనే తపనతో పాదయాత్ర ప్రారంభించినట్టు గంగాధర్‌ పేర్కొన్నారు. చిరంజీవి నుంచి ఏమి ఆశించడం లేదని, కలిస్తే చాలని అదే పది వేలని భావిస్తూ 726 కి.మీ దూరం నడిచి హైదరాబాద్ వచ్చాడు డెక్కల గంగాధర్. ఈ మధ్య కాలంలో తమ తమ అభిమాన నటీనటుల కోసం పాదయాత్రలు చేయడం కామన్ అయిపోయాయి కానీ గంగాధర్ దివ్యాంగుడు. అమలాపురం తాలూకా ఉప్పలగుప్తం మండలానికి చెందిన కిత్తనచెరువు గ్రామ వాసి అయిన డెక్కల గంగాధర్ కాలినడకనే చిరంజీవిని కలవాలనే ఉద్దేశంతో బ్లడ్ బ్యాంక్ కు చేరుకున్నాడు.

ఈ వార్త తెలిసిన చిరంజీవి చలించి పోయాడు. వెంటనే డెక్కల గంగాధర్ ను ఇంటికి పిలిపించుకుని గంగాధర్ తో సమయం గడిపారు. అనంతరం గంగాధర్ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. అతని కుటుంబ నేపథ్యం, ఇతర విషయాలు అడిగి తెలుసుకున్నారు. ఇలాంటి సాహసాలు మళ్లీ చేయవద్దని సున్నితంగా హెచ్చరించారు. అయితే తమ అభిమాన హీరోను చూస్తే చాలనుకున్న గంగాధర్ చిరంజీవి ఆతిథ్యానికి పులకించిపోయారు. చిరును కలవడంతో గంగాధర్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. దీంతో తాను జీవితాంతం రుణపడి ఉంటానని గంగాధర్ ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నారు.