పేద గిరిజన వైద్య విద్యార్థినికి మంత్రి కేటీఆర్ ఆర్థిక సహకారం

పేద గిరిజన వైద్య విద్యార్థినికి మంత్రి కేటీఆర్ ఆర్థిక సహకారంహైదరాబాద్: నగరంలోని బోరబండ ప్రాంతానికి చెందిన అనూష కిర్గిజిస్తాన్ హెల్త్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చదువుతుంది. అయితే కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఆమె భారతదేశానికి తిరిగి వచ్చింది. ప్రస్తుతం తాను చదువుతున్న వైద్య విద్య కోర్సులో మొదటి మూడేండ్లలో 95 శాతం మార్కులతో ఉత్తమ ప్రతిభ కనబరిచింది. అయితే కరోనా నేపథ్యంలో చదువును కొనసాగించే పరిస్థితులు లేకపోవడంతో తన తల్లితో కలిసి కూరగాయలు అమ్మడం ప్రారంభించింది. పేద గిరిజన కుటుంబానికి చెందిన అనూష తండ్రి వాచ్మెన్ గా పని చేస్తున్నారు.

తన వైద్య విద్య కోర్సు ఫీజుల కోసం ఇబ్బందులు పడుతున్న విషయం మంత్రి కేటీఆర్ దృష్టికి వచ్చింది. తన పేదరిక పరిస్థితుల నేపథ్యంలోనూ ఎంతో ఛాలెంజింగ్ గా, వైద్య విద్యపై మక్కువతో విదేశాలకు వెళ్లి చదువుకునే ప్రయత్నం చేస్తున్న అనూషకి కేటీఆర్ అండగా నిలిచేందుకు నిర్ణయం తీసుకున్నారు.

ఈక్రమంలోనే బుధవారం అనూష వైద్య విద్యను కొనసాగించేందుకు అవసరమైన ఆర్థిక సహాయం అందించారు. అనూష ఎంబీబీఎస్ ఫీజుల బాధ్యత తీసుకుంటానని కేటీఆర్ హామీ ఇచ్చారు. కోర్సు పూర్తి చేసుకొని డాక్టర్ గా తిరిగి రావాలని కోరారు. ఈ సందర్భంగా అనూష కి ఆల్ ద బెస్ట్ చెప్పిన మంత్రి, ఆమెకు అన్ని విధాలుగా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. అనూష వైద్య విద్యకు అండగా నిలిచిన మంత్రి కేటీఆర్ కి ఆమె కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది.