సముద్ర తీరంలో మిస్సైల్ కలకలం

సముద్ర తీరంలో మిస్సైల్ కలకలంనెల్లూరు జిల్లా: నెల్లూరు జిల్లాలో మిస్సైల్ కలకలం రేపింది. పెదపాళెం సముద్రతీరంలో మిస్సైల్ శకలం కనిపించడంతో స్థానికులు అవాక్కయ్యారు. వెంటనే మెరైన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్థానికుల సమాచారంతో పెదపాళెం సముద్రతీరానికి వచ్చిన ఇస్కపల్లి మెరైన్ సీఐ పెంచలరెడ్డి, ఎస్సైలు రసూల్ సాహెబ్ , మహేంద్రలు మిస్సైల్ శకలాలను పరిశీలించారు. ఆ శకలం జెట్‌ విమాన శకలం కాదని, ఎయిర్‌ఫోర్స్‌ మిస్సైల్‌ అని మెరైన్‌ పోలీస్ అధికారులు నిర్థారించారు. ఈ మిస్సైల్ శకలం గుంటూరు జిల్లా సూర్యలంక తీరం నుంచి గతంలో ఎయిర్‌ఫోర్స్‌ అధికారులు ప్రయోగించిన మిస్సైల్‌ అని మెరైన్ పోలీసులు తేల్చారు. దీన్ని సముద్రంపై ఎంత ఎత్తులో గాలి ఉంటుందో తెలుసుకునేందుకు ఉపయోగిస్తారని తెలిపారు. ఇలాంటివి మూడు ప్రయోగించగా.. ఇప్పటికి 2 లభించాయని.. తాజాగా విడవలూరు మండల తీర ప్రాంతంలో మరొకటి బయటపడిందన్నారు. దీన్ని ఇస్కపల్లి మెరైన్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించి మెరైన్‌ అధికారులకు సమాచారం ఇచ్చామని త్వరలోనే వారు దీనిని తీసుకువెళతారని తెలిపారు. దీంతో నెల్లూరు జిల్లా ప్రజలందరూ ఊపిరి పీల్చుకున్నారు.