పిల్లల ఆధార్‌ నమోదుకు కొత్త నిబంధన

పిల్లల ఆధార్‌ నమోదుకు కొత్త నిబంధన

పిల్లల ఆధార్‌ నమోదుకు కొత్త నిబంధనవరంగల్ టైమ్స్, ఢిల్లీ : పిల్లల ఆధార్‌ కార్డుల జారీకి వారి తల్లిదండ్రుల ఆధార్‌ నంబర్లు దరఖాస్తు ఫారంలో తప్పనిసరి చేస్తూ ఆధార్‌ కార్డుల జారీ సంస్థ యూఐడీఏఐ నిర్ణయం తీసుకుంది. తల్లిదండ్రుల ఇద్దరి ఆధార్‌ నంబర్ల నమోదుతో పాటు ఆ ఇద్దరిలో ఎవరో ఒకరు తమ ఆధార్‌ బయోమెట్రిక్‌తో కూడిన ఆమోదం తెలి­యజేయాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఐటీ మంత్రిత్వ శా­ఖ యూఐడీఏఐ విభాగపు డిప్యూటీ డైరెక్టర్‌ ప్రభాకరన్‌ ఆదేశాలు జారీ చేశారు.

వయసును బట్టి దరఖాస్తు ఫారం..
ఐదేళ్లలోపు పిల్లలకు కొత్తగా ఆధార్‌ కార్డుల జారీ లేదా ఆధార్‌లో వారి వివరాల అప్‌డేట్‌ చేసేందుకు ఒక రకమైన దరఖాస్తు ఫారం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది.
ఐదు ఏళ్లకు పైబడి 18 ఏళ్ల మధ్య వయసు వారికి వేరే దరఖాస్తు ఫారం నమూనాను యూఐడీఏఐ సంస్థ విడుదల చేసింది. 18 ఏళ్ల పైబడిన వారికి మరో ఫార్మాట్‌లో దరఖాస్తు ఫారం ఉంటుందని పేర్కొంది.

ఈ మేరకు మూడు రకాల దరఖాస్తు ఫారాల నమూనాలను యూఐడీఏఐ తాజాగా జారీ చేసిన ఆదేశాలతో పాటే విడుదల చేసింది. ఈ నెల 15 నుంచి ఈ మూడు రకాల దరఖాస్తు ఫారాల విధానం అమలులోకి రాగా, దరఖాస్తు ఫారాలను అన్ని భాషల్లో అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకున్నట్టు తెలిపింది.