త్వరలో నమస్తే ఆంధ్రప్రదేశ్ !
వరంగల్ టైమ్స్, ఢిల్లీ : నమస్తే తెలంగాణ పత్రికను త్వరలో ఆంధ్రప్రదేశ్లో ప్రారంభిస్తున్నారని సమాచారం. దీనికి సంబంధించిన ఆర్ఎన్ఐ నెంబర్ వచ్చేసిందని, పత్రికకు సంబంధించిన ప్రింటింగ్ ఏర్పాట్లు కూడా జరిగాయని తెలిసింది. ఒక మంచి ముహూర్తం చూసి ఈ పత్రికను ఏపీలో ప్రారంభించే అవకాశముంది. తెలంగాణ ప్రజల ఆకాంక్ష, ఆశయాలను నెరవేర్చడానికి ఉద్యమ సమయంలో ఈ పత్రిక కీలక భూమిక పోషించిన విషయం తెలిసిందే. ఒక రకంగా చెప్పాలంటే ప్రత్యేక తెలంగాణను సాధించేందుకు నమస్తే తెలంగాణది ప్రధానమైన పాత్ర అని చెప్పొచ్చు. కేంద్రంలో పాగా వేసేందుకు సిద్ధమవుతున్న రాష్ట్ర సీఎం కేసీఆర్..ఆంధ్రప్రదేశ్లో తమ గళాన్ని విప్పేందుకు ఓ పత్రిక అవసరమని భావించి, తాజా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ప్రస్తుతం ఏపీలో పత్రికలు అధికార, ప్రతిపక్ష పార్టీలుగా విడిపోయాయి. ఈ నేపథ్యంలో నమస్తే ఆంధ్రప్రదేశ్ పత్రిక ప్రతీ ఒక్కర్ని ఆకర్షించే అవకాశముంది. మరి ఈ పత్రికకు ఎడిటర్ ఎవరనే విషయం అతిత్వరలో తెలుస్తుంది. ఈ పత్రిక రాక ఆంధ్రప్రదేశ్ లోని జర్నలిస్టులకు శుభవార్త అని చెప్పొచ్చు. ఎందుకంటే కరోనా తర్వాత కొన్ని ప్రధాన మీడియా సంస్థలు అర్థాంతరంగా కొందరు జర్నలిస్టులను తొలగించాయి. ఫలితంగా కొంతమంది సిబ్బంది రోడ్డు పడ్డారు. ఇందులో అధిక శాతం మంది వేరే రంగంలోకి వెళ్లిపోయారు. తాజాగా నమస్తే ఆంధ్రప్రదేశ్ పత్రిక రాకతో ఏపీలోని జర్నలిస్టులకు అవకాశాలు లభిస్తాయని చెప్పొచ్చు.