త్వరలోనే రైతుల ఖాతాల్లోకి డబ్బులు

త్వరలోనే రైతుల ఖాతాల్లోకి డబ్బులుహైదరాబాద్: ఈ నెల 27నుంచి వచ్చే నెల జనవరి 2020, 7వ తేదీ వరకు రైతులకు రైతుబంధు సహాయం అందించనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. రాష్ట్రంలో ఏ ఒక్క రైతు మిగలకుండా అందరికీ సాయం అందించాలని సిఎం అధికారులను ఆదేశించారు. రైతుల ఖాతాలోనే నేరుగా డబ్బులను జమ చేయాలని చెప్పారు. దీనికోసం అవసరమైన రూ.7,300 కోట్లను విడుదల చేయాలని ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. తక్కువ విస్తీర్ణం కలిగిన రైతుల నుంచి మొదలుపెట్టి, ఎక్కువ విస్తీర్ణం కలిగిన రైతుల వరకు అందరికీ పది రోజుల వ్యవధిలో డబ్బులు జమ చేయాలని అధికారులకు సీఎం సూచించారు. యాసంగి సీజన్ రైతుబంధు సహాయం (రెండో విడత) పంపిణీకి సంబంధించి అధికారులతో సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు. రైతుబంధు సహాయం పంపిణీకి అనుసరించాల్సిన విధానంపై చర్చించి, కార్యాచరణను ఖరారు చేశారు. ఈ సమీక్షలో వ్యవసాయ శాఖ మంత్రి ఎస్. నిరంజన్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణ రావు, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి జనార్థన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.