అభివృద్ధికి ఓరుగల్లు దిక్సూచి: మంత్రి జగదీష్ రెడ్డి

మౌలిక సదుపాయాల కల్పనలో తెలంగాణా టాప్
వరంగల్ అభివృద్ధి తెలంగాణ కు రోల్ మోడల్
కాళోజీ, కాకతీయుల చరిత్ర ప్రభుత్వ నిర్మాణాలకు ప్రతిరూపాలు
ఫ్లోరోసిస్ ను నిర్ములించిన ఘనత కేసీఆర్ ది
పట్టణాభివృద్ధిలో మంత్రి కేటీఆర్ కు సాటిరారెవరు
ప్రపంచ దేశాల నుండి వస్తున్న ప్రశంసలు అందుకు తార్కాణం : మంత్రి జగదీష్ రెడ్డి

అభివృద్ధికి ఓరుగల్లు దిక్సూచి: మంత్రి జగదీష్ రెడ్డి

వరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా : మౌలిక సదుపాయాల కల్పనలో తెలంగాణ అద్భుతమైన ప్రగతిని సాధించిందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. అభివృద్ధిలో తెలంగాణా రాష్ట్రానికి వరంగల్ రోల్ మోడల్ గా నిలిచిందని ఆయన చెప్పారు. అందుకు సీఎం కేసీఆర్ ముందు చూపుతో తీసుకున్న నిర్ణయాలే ఇందుకు కారణమని ఆయన తెలిపారు. నల్లగొండ జిల్లా కేంద్రాన్ని నుడాగా మార్చిన నేపథ్యంలో వరంగల్ లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు.

ఆదిశగా నల్లగొండలో నిర్మాణాలు చేపట్టేందుకు మంత్రి జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, సూర్యపేట, నల్లగొండ మున్సిపల్ కమిషనర్లు రమణా చారి, రామంజుల్ రెడ్ది లతో పాటు మున్సిపల్, పబ్లిక్ హెల్త్, టూరిజం ఇంజనీర్ల బృందం ఈ రోజు హనుమకొండ జిల్లా కేంద్రంలో పర్యటించారు.

ఈ సందర్భంగా అంబేద్కర్ జంక్షన్, కాళోజీ కళాక్షేత్రం, జైన్ టెంపుల్, భద్రకాళి బండ్ ను సందర్శించారు. అనంతరం ఆయన ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, మేయర్ గుండు సుధారాణిలతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ నిర్మిస్తున్న నిర్మాణాలు కాకతీయులు, కాళోజీ, ఆచార్య జయశంకర్ చరిత్రకు ప్రతిరూపాలని ఆయన అభివర్ణించారు.

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఫ్లోరోసిస్ మహమ్మారిని పారద్రోలిన ఘనత ముమ్మాటికీ సీఎం కేసీఆర్ దేనని ఆయన కొనియాడారు. ఉద్యమాలతో పాటు అభివృద్ధికి ఓరుగల్లు దిక్సూచిగా నిలిచిందన్నారు. పట్టణాభివృద్ధిలో రాష్ట్ర పురపాలక మరియు ఐటి శాఖా మంత్రి కేటీఆర్ కు ఎవరూ సరిరారని అంటూ ఆయన కితాబిచ్చారు. ప్రపంచ దేశాల నుండి అందుతున్న ఆహ్వానాలు, ప్రశంశలు అందుకు అద్దం పడుతున్నాయని పేర్కొన్నారు.