లతాజీ మరణంతో సంగీత మహల్ ఆగిపోయింది: కేసీఆర్

లతాజీ మరణంతో సంగీత మహల్ ఆగిపోయింది: కేసీఆర్వరంగల్ టైమ్స్,హైదరాబాద్: ప్రఖ్యాత నేపథ్య గాయని, భారతరత్న లతా మంగేష్కర్ మరణం పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. స్వర్గీయ లతా మంగేష్కర్ కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఎనిమిది దశాబ్దాల పాటు తన పాటతో భారతీయ సినీ సంగీత రంగంపై చెరగని ముద్రవేశారని గుర్తు చేశారు. ఆమె మరణం భారత సినీ, సంగీత రంగానికి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. భారత దేశానికి లతా మంగేష్కర్ ద్వారా గాంధర్వ గానం అందిందని, ఆమె భారతీయ సంగీతానికి దేవుడిచ్చిన వరం అని సీఎం కొనియాడారు. లతా జీ మరణంతో పాట మూగబోయినట్లైందని, సంగీత మహల్ ఆగిపోయిందని విచారం వ్యక్తం చేశారు. 20 భాషల్లో 1000 సినిమాల్లో 50 వేలకు పైగా పాటలు పాడిన లతా జీ సరస్వతీ స్వర నిధి. ఆమె పాటల మహల్. వెండితెర మీది నటి హావభావాలకు అనుగుణంగా ఆ నటియే స్వయంగా పాడుతుందా అన్నట్టు తన గాత్రాన్ని అందించిన లతాజీ గొప్ప నేపథ్యగాయని అని గుర్తు చేసుకున్నారు.

” సినీ నిర్మాతలు మొదట హీరో, హీరోయిన్లను ఖరారు చేసుకుని సినిమా నిర్మాణం ప్రారంభిస్తారు. కాని, సింగర్ గా లతాజీ సమయం ఇచ్చినంకనే సినిమా షూటింగ్ ప్రారంభించే వారంటే ఆమె గొప్పతనం అర్థం చేసుకోవచ్చని అన్నారు. పాటంటే లతా జీ .. లతా జీ అంటే పాట. సప్త స్వరాల తరంగ నాదాలలో శ్రోతలను తన్మయత్వంలో ఓలలాడించిన లతా మంగేష్కర్, ఉత్తర దక్షినాదికి సంగీత సరిగమల వారధి. హిందుస్తానీ సంప్రదాయ సంగీతాన్ని ఉస్తాద్ అమంత్ అలీఖాన్ వద్ద నేర్చుకున్న లతాజీ ఉర్దూ కవుల సాహిత్యాన్ని అధ్యయనం చేయడం వలన, తన గాత్రంలో ఉర్దూ భాషలోని గజల్ గమకాల సొబగులను లాతాజీ గాత్రం ఒలికించేది. కొందరికి పురస్కారాల వల్ల గౌరవం వస్తే, దేశ విదేశాల వ్యాప్తంగా ఆమెకు అందిన లెక్క లేనన్ని పురస్కారాలకు లతా జీ వల్ల గౌరవం దక్కింది. ఎందరో గాయకులు రావచ్చు కాని లతా జీ లేని లోటు పూరించలేనిది” అని సీఎం స్మరించుకున్నారు.