శివానంద మూర్తి జీవిత విశేషాలు

వరంగల్: 1935-36 ప్రాంతాలలో నెల్లూరులో కొందరు శ్రీరమణ మహర్షి పటం ఎదురుగా కూర్చొని భజన చేస్తున్నారు. ఆ పటంలో నుంచి శ్రీ రమణులు వచ్చి… భజన చేస్తున్న వారిలో ఉన్న ఒక బాలుని చెక్కిలి నిమిరి అంతర్ధానమయ్యారు. ఈ సంఘటన ఆ బాలునికి తప్ప మరెవరికీ తెలియదు. ఆ బాలుని పేరు కందుకూరి శివానందమూర్తి. ఆ బాలుడే ఉత్తరోత్తరా గొప్ప యోగిగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా, జ్ఞానిగా.. కొన్ని వేలమంది హృదయాలలో ఆధ్యాత్మిక దీపాలను వెలిగించారు. జూన్‌ 10వ తేదీ శనివారం ఆ మహనీయుని పుణ్యతిథి. ఈ సందర్భంగా.. సచ్చిదానంద స్ఫూర్తిగా కీర్తి గడించిన శివానంద మూర్తి జీవిత విశేషాలు..
రువుశివానందమూర్తి గారు రాజమహేంద్రవరంలో 1928 డిసెంబరు 20న జన్మించారు. వీరి తల్లితండ్రులు కందుకూరి వీర బసవరాజు, సర్వమంగళాదేవి. గురువుగారు చిన్న వయసు నుంచీ అసమాన ప్రజ్ఞ ప్రదర్శించేవారు. వారి పన్నెండో ఏట ఒక ఉత్తర భారత యోగి.. కోరకుండానే ఆయనకు మంత్రోపదేశం చేశారు.శివానంద మూర్తి జీవిత విశేషాలుతన జన్మకొక ప్రయోజనం ఉందని చిన్ననాడే గ్రహించిన ఆయన..సస్యశ్యామలమైన గోదావరీ డెల్టా ప్రాంతాన్ని విడిచి.. వరంగల్లు ప్రాంతానికి చేరుకున్నారు. అప్పుడు ఆయన వయసు పదిహేడేళ్లే. ‘వెళ్తే వెళ్లావు గానీ, వెయ్యి రూపాయలన్నా తీసుకుని వెళ్ల’మని వారి తండ్రి ఎంత చెప్పినా… ‘నాకొక వంద రూపాయలు చాల’ంటూ వచ్చేశారాయన. వరంగల్లు చేరి పోలీసు శాఖలో నెలకు 140 రూపాయల జీతమ్మీద చిన్న ఉద్యోగం సంపాదించారు. ఆ శాఖలో ఎన్నో ఏళ్లు పని చేసి స్వచ్ఛందంగా ఉద్యోగ విరమణ చేశారు. వారి వివాహం 1950లో జరిగింది. నలుగురు సంతానం. 1984లో సతీవియోగమైంది.
శివానందమూర్తిగారు ఉద్యోగ బాధ్యతలనూ, సంసార విషయాలనూ చూసుకుంటున్నా…యోగ సాధనని మాత్రం విడువక అందులో అద్భుతమైన ఫలితాలు పొందారు. అంతేకాక మన వేదవేదాంగ సంబంధమైన గ్రంథాలనూ, భగవద్గీతనూ క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. జంగమ విజ్ఞాన సర్వస్వమయ్యారు. 1970 దశకం వచ్చేటప్పటికి తన కార్యక్రమం మొదలుపెట్టారు. ఆసక్తి గల వారికి మన సనాతన ధర్మం గురించీ, ఉపనిషత్తుల గురించీ, గురుతత్త్వం గురించీ ఎన్నో ప్రవచనాలు చేశారు. వారు చెప్పిన విషయాలను ఎప్పటికప్పుడు రాసుకొని దాదాపు 1,500 పేజీల గ్రంథాన్ని తయారు చేశారు పుణ్యాత్ములు కొమాండూరి విద్యావతి- ఆమె భర్త శ్రీనివాసన్‌. గురువుగారు స్వయంగా ఎన్నో గ్రంథాలూ, వ్యాసాలూ రాశారు.

 

ఏ గ్రంథానికదే గొప్పది. ఆయన కఠోపనిషత్తుపై రాసిన భాష్యం అతి విశిష్టమైనది. ఆత్మానుభూతి పొందడానికి, ఆధునిక కాలంలో శ్రీరమణ మహర్షి బోధించిన ఆత్మమూలాన్వేషణ ఉత్తమ పద్ధతి అనేవారు. కానీ, ముముక్షువులెంత మంది ఉంటారు. సామాన్య ప్రజలకు కూడా ఒక మార్గం చూపాలనేవారు శివానందమూర్తి గారు. ఇతరుల పట్ల గల అక్కరని సూచించే వారి సందేశం చూడండి. ‘‘నేను ఈశ్వరుణ్ణి ప్రార్థించేది ఒక్కటే నా అంతఃకరణలో నేను పొందిన క్షేమం, తృప్తి, శాంతి ఈ మూడూ అందరికీ ఈశ్వరుడివ్వాలి. దేశంలో సంక్షోభము, అశాంతి మొదలైనవి శాంతించాలనీ, మంచివారంతా సుఖపడాలనీ, అందరూ మంచివారు కావాలని కోరడం… భగవంతుని అందుకై ప్రార్థించడం, ఇదే నా కర్తవ్యం. తృప్తి, అహింస, మత్సరం లేని సర్వభూత హితం, గొప్ప తపస్సు… ఇవి ప్రతి వ్యక్తికీ సాధ్యమే. అదే దేశమంతటా చేసిన ఈశ్వర ప్రతిష్ఠ అవుతుంది. ఎక్కడో ఆలయ ప్రతిష్ఠ కన్నా ఇది గొప్పది’’ (ఇది 2011 డిసెంబరు 20 తన 83వ జన్మదినాన గురువు శివానందమూర్తి గారు ఇచ్చిన సందేశం). ఉద్యోగ విరమణ తరువాత ఆయన ఆధ్యాత్మిక నిలయమనదగిన ‘ఆనందవనం’ అనే తోటలో స్థిరపడ్డారు. ఇది భీమునిపట్టణంలో ఉంది. ఈ తోటలోనే వానప్రస్థాశ్రమ దశకు చేరుకున్న వృద్ధ దంపతులు కూడా నివసించడానికి వీలుగా ఇళ్లు కట్టుకునే వెసులుబాటు కల్పించారు. ఆనందవనంలో ఇంకో రెండు విశేషాలున్నాయి. మొదటిది ఆయన సొంత లైబ్రరీ. దీనిలో అనేక విషయాల గురించి దాదాపు ఇరవైరెండువేల గ్రంథాలున్నాయి.

వీటన్నిటినీ ఆయన చదివారు. రెండోది…మహాలక్ష్మీదేవి దేవాలయం. మన దేశ పశ్చిమ తీరంలో ఉన్నంత సిరిసంపద తూర్పు కోస్తాలో లేదనీ, ఆ కొరతను తీర్చడానికి ఆయన ఈ ఆలయాన్ని ఉద్దేశించారు. ‘దైవభక్తి కన్నా…దేశభక్తి గొప్పది’ అని శివానందమూర్తి నమ్మకం. మన పుణ్యస్థలాలన్నింటినీ శిష్యబృందంతో పర్యటించారాయన. అంతేకాక వేదమతమైన హిందూ ధర్మానికి మూల స్తంభాలు యజ్ఞాలని చెప్పేవారు. లోక కల్యాణానికై…దేశంలో వివిధ ప్రాంతాల్లో దాదాపు రెండు వందలకు పైగా యజ్ఞాలు నిర్వహించారు. సనాతన ధర్మ ట్రస్టు నెలకొల్పి ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేసి… అజ్ఞాత కళాకారులకు ఒక వేదిక కల్పించారు. ‘సుపథ’ అనే త్రైమాసిక పత్రికను స్థాపించి..తద్వారా ఎన్నో ఆసక్తికరమైన, చారిత్రక విషయాల గురించి వ్యాసాలు రాసేవారిని ప్రోత్సహించారు. మన దేశ చరిత్రకు వక్రభాష్యం చెప్పిన పాశ్చాత్యులూ, వాళ్లనే అనుసరిస్తూ రాస్తున్న భారతీయ చరిత్రకారుల కబంద హస్తాల నుంచి విముక్తి కలిగించాలనీ, భారత దేశ చరిత్రను సదవగాహనలో మళ్లీ రాయాలనీ అనుకునేవారు.

కఠోపనిషత్తునే విశ్లేషించిన ఆ మహాయోగికి మృత్యుభీతి ఎలా ఉంటుంది? మృత్యువు మన అధీనంలో ఉండాలంటూడేవారు. తదనుగుణంగానే తమ అవతార సమాప్తికి సంబంధించిన నిర్ణయం తీసుకుని… ముందుగానే తన కుమారునికి చెప్పి స్వచ్ఛందంగా దేహత్యాగం చేశారు. 2015 జూన్‌ 10న వరంగల్‌లో ఇది జరిగింది. వారి సమాధి కూడా అక్కడే ఉంది. దీనిని గురుధామం అంటారు. భీమునిపట్టణంలోని ఆనందవన ఆశ్రమమూ, వరంగల్‌లోని గురుధామమూ గురువుగారి స్మృతికి శాశ్వత నిలయాలు. ఇవి కాక కృష్ణాజిల్లా జగ్గయ్యపేట సమీపంలో ఉన్న బలుసుపాడు అనే గ్రామంలోని గురుధామంలో ఆయన కాంస్య విగ్రహముంది. శివానందమూర్తి గారి బోధనలు సదా ఆచరణీయం. అజ్ఞానాన్ని దూరం చేసే వెలుగు రేఖలు. భాగవతోత్తముడైన గురువుగారిని తలచినంత మాత్రాన ఆనందం కలుగుతుంది. అందుకే ఆయన సదా స్మరణీయుడు.