కందికొండకు ఇక సెలవు

కందికొండకు ఇక సెలవు

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : ప్రముఖ సినీ గేయ రచయిత కందికొండ యాదగిరి అంత్యక్రియలు ముగిసాయి. వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలోని నాగుర్లపల్లిలో కుటుంబసభ్యులు, అభిమానులు గాయకుల మధ్య అంతిమసంస్కారాలు ముగిశాయి. కందికొండ యాదగిరి పార్ధీవ దేహాన్ని చివరిసారిగా చూసేందుకు వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలోని నాగుర్లపల్లికి అభిమానులు, గాయకులు, పలువురు ప్రముఖులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మానకొండూరు ఎమ్మెల్యే రసమయి కందికొండ పార్ధీవ దేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.కందికొండకు ఇక సెలవుకందికొండ అకాల మరణం సినీ రంగానికి కాకుండా యావత్ తెలంగాణకు తీరని లోటని తెలిపారు. కందికొండ అంతిమయాత్రలో పాల్గొన్న రసమయి యాదగిరి పాడెను మోశారు. కందికొండ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవడంతో పాటు యాదగిరి కుమారునికి తెలంగాణ సాంస్కృతిక సారథిలో కీబోర్డ్ ప్లేయర్ గా ఉద్యోగం ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. పలువురు గాయకులు కందికొండ యాదగిరిపై పాటలు పాడి తమ అభిమానాన్ని చాటుకున్నారు.

కందికొండ విద్యాభ్యాసం..
జన హృదయాలను హత్తుకునేలా ఎన్నో పాటలు రాసిన కందికొండ, చక్రి సంగీత దర్శకత్వంలో ఎక్కువ పాటలు రాశారు. ఆయన పూర్తి పేరు కందికొండ యాదగిరి. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం నాగుర్లపల్లిలో కందికొండ యాదగిరి జన్మించారు. ఓయూలో ఎంఏ తెలుగు, ఎంఏ పాలిటిక్స్ చదివారు. తెలుగు సాహిత్యం, రచనలపై తనకున్న ఆసక్తి కారణంగా క్రమంగా సినీ రంగంవైపు అడుగులు వేశారు. ఇంటర్ చదువుతున్న సమయంలోనే సంగీత దర్శకుడు చక్రితో స్నేహం ఏర్పడింది.

కందికొండ పాటల ప్రయాణం..
2001 లో పూరి జగర్నాథ్ దర్శకత్వం వహించిన ‘ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం’ చిత్రంలో ‘మళ్లికూయవే గువ్వ’ పాటతో ఆయన గేయ రచయితగా మారారు. మంచి మెలోడీ గీతంగా ఆ పాట శ్రోతలను విశేషంగా అలరించింది. దీంతో సినీ పరిశ్రమలో కందికొండకు వరుస అవకాశాలు వచ్చాయి. అలా ‘ఇడియట్ ‘లో ‘చూపుల్తో గుచ్చి గుచ్చి’, ‘సత్యం’ లో ‘మధురమే మధురమే’ , ‘ఐయామ్ ఇన్ లవ్ ‘, ‘పోకిరి’ లో ‘గల గల పారుతున్న గోదారిలా’ , ‘జగడమే’, ‘లవ్ లీ’ లో ‘లవ్ లీ లవ్ లీ’ తదితర పాటలు రాశారు. చివరిగా 2018లో ‘నీది నాది ఒకే కథ’ లో రెండు పాటలు రాశారు.

సినిమా పాటలే కాకుండా బతుకమ్మ నేపథ్యంలో రాసిన పాటలు పల్లెపల్లెనా, గడపగడపనా జనం నోట మార్మోగాయి. పాటలే కాదు, కవిత్వం రాయడంలోనూ కందికొండ దిట్ట. తెలంగాణ యాసలో మనసుకు హత్తుకునేలా కవిత్వం రాయడం కందికొండ ప్రత్యేకత. మట్టిమనుషుల బాధలు, పల్లె బతుకు చిత్రాలను కథలుగా రచించి కథకుడిగాను విశేషమైన ఆదరణ పొందారు.