ప్రధాని మోడీతో సీఎం కేసీఆర్ భేటీ

ప్రధాని మోడీతో సీఎం కేసీఆర్ భేటీ

ఢిల్లీ: తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. రెండో రోజు పర్యటనలో భాగంగా దాదాపు అరగంట పాటు ప్రధాని నరేంద్రమోదీతో కేసీఆర్ సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై సీఎం కేసీఆర్ ప్రధానితో చర్చించినట్లు సమాచారం. కేంద్రస్థాయి నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విభజన చట్టంలోని పలు అంశాలపై వీరిద్దరూ చర్చించినట్లు సమాచారం. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించడం, పాలమూరు-రంగారెడ్డి , డిండి ఎత్తిపోతల పథకాలకు సహకారం అందించడం, ఎఫ్ ఆర్ బీఎం పరిమితి పెంపు, జీఎస్టీ బకాయిలకు సంబంధించిన అంశాలను ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్ వరదలు ముంచెత్తిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కోరినట్లుగా తక్షణ నిధులు మంజూరు చేసే విషయంపై ప్రధానితో కేసీఆర్ చర్చించినట్లు తెలుస్తోంది. పర్యటనలో భాగంగా సీఎం ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం అయ్యారు. ఇవాళ మధ్యాహ్నం కేంద్ర మంత్రి హర్ దీప్ సింగ్ పురితో జరిగిన భేటీలో రాష్ట్రంలోని దేశీయ విమానాశ్రయాల అభివృద్ధికి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. ఇప్పటికే మొదటి పర్యటనలో భాగంగా శుక్రవారం రోజు కేంద్ర మంత్రులు అమిత్ షా, జల్ శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో కేసీఆర్ సమావేశమయ్యింది తెలిసిన సంగతే.