ముచ్చింతల్ లో ఏర్పాట్లను పరిశీలించిన సీఎస్

ముచ్చింతల్ లో ఏర్పాట్లను పరిశీలించిన సీఎస్వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : ముచ్చింతల్ లో జరిగే శ్రీ రామానుజ సహస్రాబ్ది సమారోహ కార్యక్రమానికి దేశ ప్రధాని నరేంద్ర మోడీ హాజరవుతున్న నేపథ్యంలో సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డిలు ఏర్పాట్లను పర్యవేక్షించారు. అడిషనల్ డీజీలు జితేందర్, ఇంటలిజెన్స్ అడిషనల్ డీజీ అనిల్ కుమార్, సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర , రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్, వివిధ శాఖల ఉన్నతాధికారులతో కలిసి ముచ్చింతల్ శ్రీరామ నగరాన్ని వారు సందర్శించారు.

ఈ నెల 12 వరకు జరిగే శ్రీ రామానుజ సహస్రాబ్ది సమారోహా కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు వివిధ ప్రభుత్వ శాఖలు చేపట్టిన ఏర్పాట్లను సీఎస్, డీజీపీ లు పరిశీలించి, సమీక్షిచారు. ముందుగా వివిధ శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ ను పరిశీలించారు. మొత్తం ముచ్చింతల్ ప్రాంతాన్ని ఇక్కడికి వచ్చే మార్గాలన్నింటిని కవర్ చేసిన సీసీ టీవీలను పరిశీలించే ప్రత్యేక కంట్రోల్ రూమ్ ను పరిశీలించారు. ఈ సందర్బంగా వివిధ సామాజిక మాధ్యమాలు, వార్తా ఛానెళ్లలో వచ్చే అనుకూల, ప్రతికూల వార్తలను ఎప్పటికప్పుడు సమీక్షించి తగు ఆదేశాలు అందచేసే విభాగాన్ని సీఎస్, డీజీపీ పరిశీలించారు.

అనంతరం 1035 యాగ కుండలిలు ఏర్పాటు చేసిన యాగశాలను, అక్కడ అగ్నిమాపక శాఖ, విద్యుత్, శానిటేషన్ విభాగాలు చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. ప్రధాని, ఇతర ప్రముఖులు దిగే హెలిపాడ్ ను, ప్రధాని స్వల్ప బస చేసే గెస్ట్ హౌస్ ను పరిశీలించారు. ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద విగ్రహం, 216 అడుగుల ఎత్తైన శ్రీ రామానుజుల విగ్రహ స్థలాన్ని సోమేశ్ కుమార్, మహేందర్ రెడ్డిలు పరిశీలించారు. ప్రధాని ఆవిష్కరించనున్న సమతా మూర్తి విగ్రహ పరిసర ప్రాంతాలు, ప్రధాని వచ్చే మార్గాలను పరిశీలించారు.

ప్రధానితో పాటు పాల్గొనే వారి జాబితాను కచ్చితంగా ఎస్పీజి అనుమతించాల్సి ఉంటుందని నిర్వాహకులకు స్పష్టం చేశారు. ఇక్కడే ఏర్పాటుచేసిన లేజర్ షో ప్రాంతంలో బందోబస్తును సంబంధిత అధికారులతో సమీక్షించారు. ప్రధాన యాగశాలకు చినజీయర్ స్వామి నిర్వహించిన పూర్ణాహుతి కార్యక్రమానికి హాజరై ప్రసాదాన్ని స్వీకరించారు. అనంతరం, ప్రధాని దిగనున్న శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు వెళ్లి ఏర్పాట్లను సీఎస్, డీజీపీ పరిశీలించారు.