అణగారిన వర్గాలకు అండగా బీజేపీ : మోడీ

అణగారిన వర్గాలకు అండగా బీజేపీ : మోడీ

– మాదిగల పోరాటానికి బీజేపీ సంపూర్ణ మద్దతు
– సీఎం కేసీఆర్ పై ఘాటు వ్యాఖ్యలు చేసిన ప్రధాని
– అంబేద్కర్ ని కేసీఆర్ అవమానించారన్న మోడీ
– సభలో భావోద్వేగానికి గురైన మందకృష్ణ మాదిగ
– మాదిగలకు అండగా బీజేపీ ఉంటుందని హామీ
– సికింద్రాబాద్ లో మాదిగల విశ్వరూప మహాసభ

అణగారిన వర్గాలకు అండగా బీజేపీ : మోడీవరంగల్ టైమ్స్,హైదరాబాద్ : తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి ఎంఆర్‌పీఎస్‌ మాదిగ విశ్వరూప మహా సభ నిర్వహించింది. సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో జరిగిన ఈ సభకు ముఖ్య అతిథిగా ప్రధాని మోడీ హాజరయ్యారు. ఈ సభకు హాజరైన వారందరినీ ముందుగా కలవడం సంతోషంగా ఉందన్నారు ప్రధాని. ఇంత పెద్ద సభను ఏర్పాటు చేసిందుకు, సభకు తనను ఆహ్వానించినందుకు మందకృష్ణ మాదిగకు మోడీ ధన్యవాదాలు తెలిపారు. అనంతరం మోడీ బీఆర్ఎస్ ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. అన్ని వర్గాలకు సామాజిక న్యాయం చేసేందుకు బీజేపీ ప్రభుత్వం పనిచేస్తుందని మోడీ తెలిపారు. స్వాతంత్య్రం వచ్చాక అనేక పార్టీలు అధికారంలోకి వచ్చాయని కేవలం తమ ప్రభుత్వం మాత్రమే అణగారిన వర్గాలకు అండగా నిలిచిందని మోడీ చెప్పుకొచ్చారు.

30యేళ్ల మాదిగల పోరాటానికి తన సంపూర్ణ మద్ధతు ఉంటుందని తెలిపిన మోడీ, ఇకపై మీరు ఏది అడగాల్సిన అవసరం ఉండదని స్పష్టం చేశారు.పార్టీలు చేసిన పాపాలకు ప్రాయశ్చితం చేసేందుకు నేను వచ్చాను. పార్టీలు చేసిన తప్పులకు నేను క్షమాపణ చెబుతున్నాను. పేదరిక నిర్మూలన మా తొలి ప్రాధాన్యత. సామాజిక న్యాయం దిశగా మేము అడుగులు వేస్తున్నాము. అన్ని వర్గాల ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం మోసం చేసింది.తెలంగాణ పోరాటంలో అన్ని వర్గాలు పోరాటం చేశాయి. దళితుడిని మొదటి ముఖ్యమంత్రి చేస్తాన్న కేసీఆర్‌, ప్రభుత్వం ఏర్పడగానే తానే ముఖ్యమంత్రి అయ్యి దళితుల ఆశలపై నీళ్లు జల్లాడు. మూడు ఎకరాల భూమి ఇవ్వలేదు, దళిత బంధుతో కూడా లాభం జరగలేదని మోడీ ఎద్దేవా చేశారు.

‘తెలంగాణ అస్థిత్వాన్ని బీఆర్‌ఎస్‌ కాపాడలేకపోయిందని ప్రధాని మోడీ విమర్శించారు. కొత్త రాజ్యాంగం పేరుతో కేసీఆర్‌ అంబేద్కర్‌ని అవమానించారన్నారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ పార్టీలు దళిత విరోధులు, ఆ రెండు పార్టీలతో జాగ్రత్తగా ఉండాలి. తెలంగాణలో ఇరిగేషన్‌ స్కీమ్‌లు, ఇరిగేషన్‌ స్కామ్‌ల మారాయని ఆరోపించారు. ఆదివాసీ మహిళను మేం రాష్ట్రపతిగా ప్రాతిపాదిస్తే, కాంగ్రెస్‌ పార్టీ మాత్రం ఆమెను అవమానించిందని అన్నారు. బీఆర్‌ఎస్‌ రైతు రుణమాఫీ చేస్తమని చెప్పింది, ఎంత మాఫీ చేశారో చెప్పగలరా? అని మోడీ ప్రశ్నించారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ రెండు అవినీతికి ఆనవాళ్లు. బీఆర్‌ఎస్, ఆమ్‌ఆద్మీ పార్టీతో కలిసి వేల కోట్ల మద్యం అవినీతికి తెర తీశాయి. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ల మధ్య లోపాయికారి ఒప్పందం చేసుకున్నాయని విమర్శించాయి. కానీ ఒకరిపై ఒకరు పోటీ చేస్తున్నట్లు నటిస్తున్నాయి. ఇలాంటి అవకాశవాద రాజకీయాల పట్ల జాగ్రత్తగా ఉండాలని మోడీ పిలుపునిచ్చారు.అణగారిన వర్గాలకు అండగా బీజేపీ : మోడీప్రధాని మోడీ ఈ దేశాన్ని రక్షిస్తూ, అభివృద్ధి చేస్తూ మనల్ని కూడా ఆ మార్గంలో తీసుకెళ్తున్నారని ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ కీర్తించారు. మాది సామాజిక వర్గ ప్రజలు పడుతున్న బాధలు, ఇబ్బందులను వినేందుకు దేశ ప్రధాని రావడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నామన్నారు. మాదిగ సామాజిక వర్గం అని చెప్పుకోవడానికి సమాజంలో సిగ్గుపడే వాళ్లం అన్నారు. మేం ఎదురుపడితే దూరం దూరం అంటూ మమ్మల్ని పక్కన పెట్టే వాళ్లంటూ మందకృష్ణ మాదిగ భావోద్వేగానికి గురయ్యారు. తమను అంటరాని వాళ్లని పశువుల కంటే కూడా హీనంగా చూశారంటూ ఆవేదనను వ్యక్తం చేశారు.అలా తక్కువ చేసిన తమ సామాజిక వర్గానికి అండగా ఉండేందుకు ప్రధాని మోడీ రావడంపై హర్షం వ్యక్తం చేశారు. సామాజిక న్యాయాన్ని అమలు చేస్తున్న మోడీకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని అన్నారు. ఈ సభలో మాదిగల గురించి చెప్పుతూ భావోద్వేగానికి గురైన మందకృష్ణ మాదిగను ప్రధాని మోడీ ఓదార్చారు. మందకృష్ణ తన చిన్న తమ్ముడు అంటూ చెప్పుకొచ్చారు. మాదిగల అభివృద్ధికి బీజేపీ అండగా ఉంటుందని మోడీ స్పష్టం చేశారు.