దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి (57) ఇకలేరు

హైదరాబాద్‌: దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి (57) ఇకలేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందుతుండగా గుండెపోటు రావడంతో బుధవారం అర్ధరాత్రి మృతి చెందారు. ఇటీవలే రామలింగారెడ్డి కాలికి శస్త్ర చికిత్స చేయించుకున్నారు. చికిత్స అనంతరం కాలికి ఇన్‌ఫెక్షన్‌ కావడంతో అస్వస్థతకు గురయ్యారు. దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి (57) ఇకలేరుమళ్లీ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు దవాఖాలో చేరారు. ఈ క్రమంలో చికిత్స పొందుతుండగా గుండెపోటు రావడంతో అర్ధరాత్రి కన్నుమూశారు. ఆయన 2004, 2008లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి దొమ్మాట నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలుపొందారు. తెలంగాణ ఆవిర్భావం అనంతరం ఆయన 2014, 2018 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. రామలింగారెడ్డి ప్రస్తుతం శాసన సభ అంచనాల కమిటీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. సోలిపేట తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. రామలింగారెడ్డి రాజకీయాల్లోకి రాకముందు జర్నలిస్టుగా పని చేశారు. సోలిపేటకు భార్య, ఒక కొడుకు, కూతురు ఉన్నారు. ఆయన భౌతిక కాయాన్ని కుటుంబీకులు సిద్ధిపేట జిల్లాలోని స్వగ్రామం చిట్టాపూర్‌కు తరలించారు. అంత్యక్రియలు అక్కడే నిర్వహించారు. సోలిపేట మృతి చెందిన వార్త తెలుసుకొని చిట్టాపూర్‌కు పార్టీ కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. ఆయన మృతిపై సీఎం కేసీఆర్‌తోపాటు, టీఆర్ఎస్‌ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.