కేంద్ర మంత్రులకు కౌంటర్ ఇచ్చిన కేటీఆర్

* ఉద్వేగాలు కాదు – ఉద్యోగాలు ముఖ్యం
* మన లక్ష్యం విశ్వనగరం – వాళ్ళ లక్ష్యం విద్వేష నగరం
* ఆరేళ్లుగా నగరం ప్రశాంతంగా ఉంది
* ప్రశాంతంగా ఉన్న నగరంలో చిచ్చు పెట్టే కుట్రలు చేస్తున్నారు
* నగర ప్రజలు ఆలోచించి గ్రేటర్ ఎన్నికల్లో నగర అభివృద్ధికి ఓటెయ్యాలి

హైదరాబాద్‌: వరదలు వచ్చినప్పుడు రాని కేంద్రమంత్రులు ఇప్పుడు ఎన్నికలనగానే వరదలా వస్తున్నారని కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ డజను మంది కేంద్రమంత్రులు వస్తున్నారని వారందరికీ స్వాగతం పలుకుతున్నామని కానీ వచ్చేటప్పుడు ఉత్త చేతులతో రాకుండా సీఎం కేసీఆర్ డిమాండ్ చేసినట్లు వరద సాయంతో రావాలని డిమాండ్ చేశారు. ఈరోజు ఉప్పల్ నియోజకవర్గంలో జరిగిన రోడ్ షోలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. బీజేపీ నేతలు తెలంగాణకు ఎంతో ఇచ్చామని గొప్పలు చెబుతున్నారన్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న పథకాల్లో తమ వాటా కూడా ఉందని అంటున్నారని, కానీ లెక్కలోకి వెళితే తెలంగాణ ద్వారా వివిధ పన్నుల రూపంలో కేంద్రానికి వెళ్లిన సొమ్ము అక్షరాలా 2 లక్షల 72 వేల కోట్లన్నారు. తిరిగి తెలంగాణ ప్రజలకు కేవలం సగం మాత్రమే వస్తున్నాయన్నారు. ఢిల్లీ లోని బీజేపీ సర్కార్ హైదరాబాద్ కోసం చేసిన కనీసం ఒక పనిని అయినా చూపెట్టి ప్రజలను ఓట్లు అడగాలి అని కిషన్ రెడ్డి ని కేటీఆర్ నిలదీశారు. అంతేకాదు, అమిత్ షా చెప్పినట్లు మనకు ఇచ్చిందేమి లేదన్నారు. ఇంకా మాట్లాడాలంటే బీహార్, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో రోడ్లు ఇతర అభివృద్ధి పనుల కోసం ఖర్చు చేస్తున్న సొమ్ములో తెలంగాణ ప్రజల చెమట ఉందన్నారు. దేశ ప్రజలను జన్ ధన్ ఖాతాలు ఓపెన్ చేసుకోవాలని తాము ధన్ ధన్ ప్రతీ ఒక్కరికీ 15 లక్షలు ఇస్తామని ప్రజలను మోసపుచ్చారన్నారు. ఇదే విషయంలో అమిత్ షా మాట్లాడుతూ అది ఈనికల స్టంట్ అని చెప్పడం దేశ ప్రజలను పిచ్చోళ్లను చేయడమే అన్నారు.

కేంద్ర మంత్రులకు కౌంటర్ ఇచ్చిన కేటీఆర్

నగర అభివృద్ధితో సంబంధం లేకుండా కొన్ని పార్టీలు పీవీ సమాధి కూలకొడతాం అని ఒకరు, ఇంకొకరు పిల్లలను రాంగ్ రూట్లో బండి నడపమని, ముగ్గురు ముగ్గురు బండ్ల మీద తిరగమని చలాన్లు జీహెచ్ఎంసీ కడుతుందని అంటున్నారు. జీహెచ్ఎంసీ కి అభివృద్ధి పనులు చేస్తుందని ఇలా పిల్లలను ఆగం చెయ్యదని అసలు మోటార్ వెహికిల్ చట్టాన్ని 2019 లో తీసుకువచ్చిందే నితిన్ గడ్కరీ గారన్నారు. ఈ విష్యం తెలియక పిచ్చిపిచ్చిగా అవగాహనా లేకుండా సదరు ఎంపీ మాట్లాడుతున్నారన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటు వేస్తె ప్రతీ ఇంటీకీ 25 వేల రూపాయలు ఇస్తామని చెబుతున్నారని, అమ్మకు అన్నం పెట్టనోడు పిన్నమ్మకు బంగారు గాజులు చేపిస్తానన్నట్లు, వరద సాయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తున్న 10 వేల రూపాయలను ఆపినోళ్లు 25 వేలు ఇస్తామనడం విచిత్రంగా ఉందన్నారు. ఇంకో పార్టీ ఏకంగా 50 వేలు ఇస్తామని ఎన్నికల్లో ఓట్ల కోసం బాధ్యతారాహిత్యంగా హామీలు ఇస్తున్నారన్నారు. ఉప్పల్ నియోజక వర్గంలో ఐటీ కంపెనీలు తెస్తా ని కేసీఆర్ గారు అంటుంటే, కర్ఫ్యూలు తెస్తామని బీజేపీ నాయకులు అంటున్నారని తెలిపారు. తమ పిల్లలకు ఉద్యోగాలు కావాలనుకుంటే, హైదరాబాద్ నగరం ప్రశాంతంగా ఉండాలనుకుంటే ఎన్నికలొచ్చినప్పుడు ఆగం కాకుండా అభివృద్ధి చేసే టీఆర్ఎస్ పార్టీకి ఓటెయ్యాలన్నారు. డిసెంబర్ 4 వ తేదీ నుండి వరదసాయం అందని అర్హులైన ప్రతీ ఒక్కరికీ వరద సాయం 10 వేల రూపాయలు పంపిణీ చేస్తామని కేటీఆర్ తెలిపారు.

ఎవరు ఈ రాష్ట్రంలో పేదవాడికి అండగా ఉన్నారో గుర్తించండి అని కేటీఆర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పేదవాడిని కేసీఆర్ గారు కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నారన్నారు. కేసీఆర్ కిట్, ఆసరా పెన్షన్, బస్తీ దావఖానా వంటి కార్యక్రమాలతో ప్రజలకు అండగా నిలబడ్డారన్నారు. అంతేకాదు 20 వేల లీటర్ల లోపు నీటిని వాడుకున్న వారికి డిసెంబర్ నెల నుండి నల్లా చార్జీలు రద్దుచేశారన్నారు. రజక సోదరులు నిర్వహించుకునే లాండ్రీలకు, నాయీ బ్రాహ్మణ సోదరుల సెల్లోం షాపులకు విధ్యుత్ చార్జీలు రద్దు చేసిన ఘనత ముఖమంత్రి కేసీఆర్ గారిదే అన్నారు. మనసున్న ముఖ్యమంత్రి మన నాయకుడు కేసీఆర్ గారన్నారు. ఇలాంటి అభివృద్ధిని మనం కొనసాగించుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఆడబిడ్డలకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్కటే బాకీ ఉన్నదని అదే డబుల్ బెడ్ రూమ్ హామీ అని, ఖచ్చితంగా తమ హామీని నెరవేర్చుతామన్నారు. ఐదేండ్లలో ఉప్పల నియోజక వర్గంలో మంచినీటి సమస్యను తీర్చుకున్నాం. 6 ఏండ్లలో హైదరాబాద్ నగరానికి పెట్టుబడులకు గమ్య స్థానంగా మార్చుకున్నాం. ఒకనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో 200 వందలు వస్తే ఈ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం 2 వేల రూపాయలు ఇస్తోందన్నారు. కేసీఆర్ కిట్, బస్తీ దావఖానాలతో నగర ప్రజలకు అండగా ఉన్నామన్నారు. ఇదే అభివృద్ధిని కొనసాగించడానికి ప్రజలందరూ హైదరాబాద్ నగరంలో ప్రశాంతంగా ఉండాలంటే టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు కేటీఆర్ పిలుపునిచ్చారు