సిద్దిపేట లేకపోతే కేసీఆర్ లేడు

సిద్దిపేట లేకపోతే కేసీఆర్ లేడు

సిద్దిపేట: తెలంగాణను సిద్ధింపచేసిన గడ్డ సిద్దిపేట అని సీఎం కేసీఆర్ అన్నారు. సిద్దిపేట లేకపోతే కేసీఆర్ లేడు..కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదని ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ గురువారం సిద్ధిపేట పర్యటనలో భాగంగా చేపట్టిన పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అనంతరం డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం మాట్లాడారు. సిద్దిపేట ఎమ్మెల్యేగా, కరీంనగర్ ఎంపీగా రెండే చోట్ల తాను విజయం సాధించానని..తెలంగాణ సాధనలో భాగంగా ఎంపీ పదవిలో కొనసాగి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిందని సీఎం గుర్తు చేశారు. సిద్దిపేట ఎమ్మెల్యేగా రాజీనామా చేసిన సమయంలో ఎంతో దు‌‌‌:ఖించామన్నారు. ఇక్కడి నుంచి వెళ్లేటప్పుడు ఆణిముత్యంలాంటి నాయకుడిని ఇచ్చి వెళ్లానని మంత్రి హరీశ్ రావును ఉద్దేశించి మాట్లాడారు. హరీశ్ రావు తన పేరు కాపాడి అద్భుతమైన సిద్దిపేటను తయారు చేశారనే సంతోషం గుండెలనిండా ఉందని కేసీఆర్ కొనియాడారు. పూర్తి స్థాయిలో వెనుకబడిన, మారుమూల ప్రాంతాల్లో అభివృద్ధి జరగాలని కోరుకున్నట్లు ఆయన తెలిపారు. ఇందుకు అనుగుణంగానే కొత్త జిల్లాలను ఏర్పాటు చేశామని కేసీఆర్ స్పష్టం చేశారు.

సిద్దిపేటకు సీఎం కేసీఆర్ వరాలు….

సిద్దిపేట లేకపోతే కేసీఆర్ లేడుఅనంతరం సిద్దిపేట జిల్లాకు సీఎం కేసీఆర్ వరాల జల్లులు కురిపించారు. సిద్దిపేటలో చుక్కనీటి కోసం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కున్నామని నాటి పరిస్థితులను కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు రంగనాయక సాగర్ ద్వారా అద్భుత సాగునీరు అందిస్తున్నామని తెలిపారు. రంగనాయక సాగర్ చుట్టూ సుందరీకరణకు రూ.100కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. సిద్దిపేట నుంచి ఇల్లంతకుంట వరకు నాలుగురోడ్ల రహదారిని మంజూరు చేస్తామని చెప్పిన కేసీఆర్ దీనిపై రేపే ఉత్తర్వులు జారీ అవుతాయన్నారు. సిద్దిపేట డబుల్ బెడ్ రూం ఇళ్లు దేశానికే ఆదర్శంగా ఉన్నాయన్నారు. కొత్తగా మరో వెయ్యి ఇళ్లతో పాటు సిద్దిపేటకు మూడో పట్టణ పోలీస్ స్టేషన్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. టౌన్ హాల్ నిర్మాణానికి రూ.50కోట్లు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కు రూ. 26కోట్లు కేటాయిస్తున్నట్లు కేసీఆర్ వివరించారు. సిద్దిపేటలో నెలరోజుల్లో బస్తీ దవాఖానా ప్రారంభిస్తామని ఆయన హామీ ఇచ్చారు. సిద్దిపేట జిల్లాలో కాళేశ్వరం కాల్వ ద్వారా సాగునీరు అందని గ్రామాల కోసం ఎత్తిపోతల పథకం మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇర్కోడు ఎత్తిపోతల పథకంగా దానికి పేరు పెడతామన్నారు. దీనికోసం రూ.85కోట్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. రూ.161 కోట్లతో నియోజకవర్గం చుట్టూ మరో ఔటర్ రింగ్ రోడ్డు ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు.