ముచ్చింతల్ లో ఏపీ సీఎం వైఎస్ జగన్

ముచ్చింతల్ లో ఏపీ సీఎం వైఎస్ జగన్వరంగల్ టైమ్స్, హైదరాబాద్‌ : చిన్నజీయర్‌ స్వామి ఆధ్వర్యంలో శ్రీ రామానుజాచార్యుల వారి వెయ్యి సంవత్సరాలు అయిన సందర్భంగా ఆయన విగ్రహాన్ని ప్రారంభించడం శుభపరిణామమని ఏపీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. ఒక వ్యక్తి కొన్ని సిద్దాంతాల కోసం నిలబడడం, సమాజంలో అసమానతను రూపుమాపాలని వెయ్యి సంవత్సరాల క్రితం 1017లోనే ఒక థృఢమైన నమ్మకంతో తనకు ఒక స్వామి ఉపదేశించిన మంత్రాన్ని ( ఆ మంత్రం అందరికీ తెలియజేస్తే పాపం తగులుతుందేమోనని చెప్పి అంటూ ఉన్న సమాజంలో) ప్రతీ ఒక్కరికీ కూడా ఆ మంత్రం తెలియాలి, తెలియజెప్పాలని, ఆ క్రమంలో తనకు పాపం తగిలినా పర్వాలేదని ఒక గొప్ప ఉద్దేశంతో, గొప్ప భావంతో ఒక సందేశాన్ని ప్రచారం చేసిన గొప్ప మనిషి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటుచేశారు, ఆయన్ను మనం స్మరించుకుంటున్నాం అని ఏపీ సీఎం అన్నారు.

శ్రీ రామానుజాచార్యుల వారు ఆ రోజు విలువల కోసం నిలబడ్డారో ఈ రోజుకూ కూడా ఆ విలువలు ఇంకా ఇంకా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉన్న సొసైటీలో మనం ఉన్నాం. ఇది మనం గుర్తించుకోవాలి. సమాజాన్ని మార్చాలి, అందరూ సమానులే అనే గొప్ప సందేశాన్ని ఇవ్వడం కోసం చిన్నజీయర్‌ స్వామి ఈ విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. ఈ విగ్రహం భవిష్యత్‌ తరాలకు ఈ గొప్ప సందేశాన్ని ఇస్తుంది. ఇది ఒక చక్కటి ఉదాహరణగా నిలుస్తుందని జగన్ తెలిపారు.

ఇక్కడ అమెరికా నుంచి వచ్చిన పిల్లలు కూడా చక్కగా శ్లోకాలు చెబుతున్నారు. ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు చిన్నజీయర్‌ స్వామి వారికి అభినందనలు తెలుపుతున్నాను. ఇంత మంచి కార్యక్రమానికి ఈ స్ధాయిలో వచ్చేందుకు తోడ్పాటు అందించిన రామేశ్వరరావు అన్నకు కూడా మనస్పూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. అందరికీ ఆల్‌ ద వెరీ బెస్ట్‌ చెబుతూ తన ప్రసంగం ముగించారు.

సంప్రదాయ దుస్తుల్లో ప్రవచన మండపానికి వచ్చిన సీఎం వైఎస్‌ జగన్‌…చిన్నజీయర్‌ స్వామి సమక్షంలో ప్రవాస భారతీయ చిన్నారుల విష్ణు సహస్రనామ అవధాన కార్యక్రమాన్ని వీక్షించారు. కార్యక్రమం అనంతరం జూపల్లి రామేశ్వరరావు.. సీఎం వైఎస్‌ జగన్‌కు రామానుజాచార్యుల ప్రతిమను బహుకరించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి దంపతులు, డిప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి, ప్రభుత్వ విప్‌లు చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి, సామినేని ఉదయభాను, కొరుముట్ల శ్రీనివాసులు, పలువురు ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు పాల్గొన్నారు.