వరంగల్ లో దారుణం..పేషెంట్ పై ఎలుకల దాడి

వరంగల్ లో దారుణం..పేషెంట్ పై ఎలుకల దాడి

వరంగల్ టైమ్స్ , వరంగల్ జిల్లా : వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ లో దారుణం చోటుచేసుకుంది. ఆస్పత్రిలో వైద్యం కోసం వెళ్లిన ఓ పేషెంట్ పై ఎలుకలు దాడి చేశాయి. ఆర్ ఐసీయూలో అపస్మారక స్థితిలో ఉన్న బాధితుడి కాలు, చేతి వేళ్లను ఎలుకలు కొరికేశాయి. ఎలుకల దాడిలో అతడికి తీవ్ర రక్తస్రావమైంది. హనుమకొండ జిల్లా భీమారానికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి 4 రోజుల క్రితమే ఎంజీఎంలో అడ్మిట్ అయ్యాడు. శ్రీనివాస్ ఊపిరితిత్తులు, కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నాడు. గత కొన్ని రోజులుగా ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీనివాస్ కు శ్వాస తీసుకోవడంతో ఇబ్బంది పడ్డాడు.వరంగల్ లో దారుణం..పేషెంట్ పై ఎలుకల దాడిదీంతో అతన్ని కుటుంబసభ్యులు వెంటనే వరంగల్ ఎంజీఎంకు తరలించారు. అక్కడే నాలుగు రోజుల నుంచి శ్రీనివాస్ చికిత్స పొందుతున్నాయి. డయాలసిస్ చికిత్స కోసం ఆస్పత్రిలో చేరిన నాటి నుంచే శ్రీనివాస్ పై ఎలుకలు దాడి చేస్తున్నాయి. అతని రెండు చేతులు, రెండు కాళ్లను ఎలుకలు తీవ్రంగా గాయపరిచాయి. గతంలోనూ ఇదే పరిస్థితి. మొదటి రోజునే అతడి కుడిచేయి వేళ్లను ఎలుకలు కొరికాయి. అదే వార్డులో చాలామంది పేషెంట్లు ఎలుకల దాడికి గురయ్యారని వాపోతున్నారు.

పేషెంట్లపై ఎలుకల దాడికి సంబంధించి ఎంజీఎం సిబ్బందికి ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేదని బాధితులు వాపోతున్నారు. ఎలుకల దాడిలో తీవ్ర గాయాలపాలైన శ్రీనివాస్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బాధితుడి కుటుంబం ఎంజీఎం వద్ద ఆందోళన వ్యక్తం చేస్తోంది. మరో వైపు ఎలుకల బెడదపై ఆస్పత్రి ఆర్ఎంఓ మురళి దృష్టికి తీసుకెళ్లారు. ఆస్పత్రి సిబ్బందితో ఆయన ఐసీయూకి వచ్చి పరిశీలించారు. ఎలుకల నివారణకు చర్యలు తీసుకుంటామన్నారు.