ఎలాన్ మస్క్ ను ఆహ్వానించిన సీఎం జగన్

ఎలాన్ మస్క్ ను ఆహ్వానించిన సీఎం జగన్

వరంగల్ టైమ్స్, అమరావతి : టెస్లా అధినేత ఎలన్ మస్క్ ఇప్పుడు వార్తల్లో వ్యక్తి , ట్విట్టర్ ని కొన్న తర్వాత ప్రతీ రోజూ ఆయన టాక్ ఆఫ్ ది సోషల్ మీడియాగా నిలుస్తున్నారు. అలాంటి మస్క్ ఏపీకి రాబోతున్నారు. ఆయన్ని ఏపీ సీఎం జగన్ ప్రత్యేకంగా ఆహ్వానించారు. విశాఖపట్టణంలో జరగబోతున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కి ఎలాన్ మస్క్ సహా మరికొంతమంది ప్రముఖులకు సీఎం జగన్ ఆహ్వాన పత్రికలు పంపించారు. ఎలాన్ మస్క్ ను ఆహ్వానించిన సీఎం జగన్కంపెనీలను తరిమేశారు, కొత్త కంపెనీలు రావట్లేదంటూ.. ప్రతిపక్షాలు పదే పదే విమర్శలు చేస్తున్న టైంలో మార్చి 3, 4 తేదీల్లో జరగబోతున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (GIS)ను ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 2 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమానికి 15మంది కేంద్ర మంత్రులు, మరో 15 రాష్ట్రాల సీఎంలు, 44మంది ప్రపంచ ప్రఖ్యాత పారిశ్రామిక వేత్తలు, 53మంది భారతీయ వ్యాపారవేత్తలు, వివిధ దేశాల రాయబారులు రాబోతున్నారు.

ప్రధాని నరేంద్రమోడీని కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించింది ఏపీ ప్రభుత్వం. ఇక ఎలన్ మస్క్ తో పాటు యాపిల్ సంస్థ సీఈఓ టిమ్ కుక్, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, అమెజాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జెఫ్ బెజోస్, శాంసంగ్ చైర్మన్ ఓహ్-హ్యున్ క్వాన్ ని కూడా ఆహ్వానించారు. ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీ, ఆనంద్ మహీంద్రా, కుమార్ మంగళం బిర్లా, ఆది గోద్రెజ్, రిషద్ ప్రేమ్‌జీ, ఎన్.చంద్రశేఖరన్ వంటి భారతీయ వ్యాపారవేత్తలు కూడా ఈ కార్యక్రమానికి వస్తారని అంచనా.

పోర్ట్ సిటీలో ప్రతిష్టాత్మకంగా..
విశాఖను పరిపాలనా రాజధాని చేయాలనుకుంటున్న జగన్, గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ తో ఈ ప్రాంతానికి అరుదైన గుర్తింపు తేవాలనుకుంటున్నారు. 2019లో అధికారం చేపట్టాక జగన్ సారథ్యంలో విజయవాడలో విదేశీ పెట్టుబడుల కోసం ఓ సమ్మిట్ జరిగింది. ఆ తర్వాత అంతకంటే భారీ స్థాయిలో ఈ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించబోతున్నారు. మీ వ్యాపారం అభివృద్ధి కోసం మాతో కలసి పనిచేయండి అంటూ ప్రపంచ పారిశ్రామిక వేత్తలను ఆహ్వానిస్తున్నారు. ఈ కార్యక్రమంలో అడ్వాంటేజ్ ఆంధ్రప్రదేశ్ పేరుతో పెద్ద ఎత్తున ప్రదర్శన చేపట్టడానికి ప్రభుత్వం సిద్ధమైంది.

2022లో ఏపీ ప్రభుత్వం రూ. 1,26,750 కోట్ల విలువైన పెట్టుబడులను ఆకర్షించిందని, 2023 మరింత ఎక్కువ మేర పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చేలా కృషి చేస్తామన్నారు రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి. నిర్దిష్ట లక్ష్యమేదీ లేకపోయినా 5 నుంచి 8 లక్షల కోట్ల మధ్య పెట్టుబడులు వచ్చే అవకాశముందని అన్నారాయన. ఈ గ్లోబల్ సమ్మిట్ ప్రచార కార్యక్రమాలను కూడా దేశ విదేశాల్లో ఏపీ ప్రభుత్వం ప్లాన్ చేసింది. జపాన్, జర్మనీ, దక్షిణ కొరియా, అమెరికా లలో రోడ్ షో లు నిర్వహించేందుకు ప్లాన్ సిద్ధం చేసింది.