అంబేద్కర్ స్ఫూర్తితోనే సీఎం కేసీఆర్ పాలన : ఎర్రబెల్లి

అంబేద్కర్ స్ఫూర్తితోనే సీఎం కేసీఆర్ పాలన : ఎర్రబెల్లిహనుమకొండ జిల్లా : భారత రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్ అంబేద్కర్ ఆశయాలు సాధించడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా హనుమకొండలోని అంబేద్కర్ చౌరస్తాలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

అంబేద్కర్ కేవలం దళితులకు చెందిన వ్యక్తి మాత్రమే కాదు, ఆయన అందరివాడని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నేత, న్యాయవాది, సంఘ సంస్కర్తగా బహుముఖ ప్రజ్ఞాశాలిగా కీర్తించబడ్డారన్నారు. అంబేద్కర్ అంటరానితనం, కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశారని కొనియాడారు.

దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలుండాలని మొదట పోరాటం చేసింది అంబేద్కరే అనే విషయాన్ని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. మొదటి న్యాయశాఖ మంత్రి అయ్యాక దళితులకు రిజర్వేషన్లు కల్పించింది కూడా డా.బీఆర్ అంబేద్కరేనని మంత్రి తెలిపారు. ఈ రోజు ప్రజాస్వామ్యాన్ని అనుభవిస్తున్నామంటే ఆ పుణ్యం అంబేద్కర్ దే అన్నారు.

ఈ మహనీయుడి స్ఫూర్తితో సీఎం కేసీఆర్ దళితుల అభ్యున్నతి కోసం నిరంతరం పాటు పడుతున్నాడని పేర్కొన్నారు. రూ. 10 వేల కోట్లతో రాష్ట్రంలోని దళితవాడల అభివృద్ధి చేస్తామన్నారు. దళితుల సంక్షేమం, అభివృద్ధి కోసమే దళిత బంధు పథకమన్నారు. ఈ కార్యక్రమంలో హనుమకొండ జెడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్, మాజీ ఎంపీ సీతారాంనాయక్, ఎమ్మెల్యే డా.టి. రాజయ్య, అంబేద్కర్ యువజన సంఘం నాయకులు పాల్గొన్నారు.