బూస్టర్ డోస్ పై నేడు ఢిల్లీలో కీలక నిర్ణయం

బూస్టర్ డోస్ పై నేడు ఢిల్లీలో కీలక నిర్ణయంఢిల్లీ: కరోనా కేసుల సంఖ్య నెమ్మదిగా పెరుగుతోంది. మరోవైపు ఓమిక్రాన్ కేసులు ఇండియాకు ధడ పుట్టిస్తున్నాయి. కరోనా వ్యాక్సిన్ తీసుకున్నా మళ్లీ రిఇన్ఫెక్షన్ల బారిన పడుతున్నారు ప్రజలు. మరోవైపు దేశంలో 50 శాతం మందికి రెండో డోసులు, 86 శాతం మందికి కనీసం ఒక డోసు అందినట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో మళ్లీ బూస్టర్ డోసుల ప్రాధాన్యత పెరుగుతోంది.

ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు బూస్టర్ డోసులపై నిర్ణయం తీసుకోవాలని కేంద్రంపై ఒత్తడి పెంచుతున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాలు బూస్టర్ డోసులు వేయానలి కేంద్రాన్ని కోరాయి. ఇటీవల తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు కూడా బూస్టర్ డోసులు వేయాలని.. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మండవీయకు లేఖ రాశారు. తెలంగాణలో పాటు ఢిల్లీ, కేరళ, ఏపీ, ఒడిశా వంటి రాష్ట్రాలు బూస్టర్ డోసులపై నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాయి.

కరోనా కొత్త వేరియంట్ ఓమిక్రాన్ పై కేంద్రం కూడా అలెర్ట్ అయింది. దీంతో ఈరోజు బూస్టర్ డోసులపై ఏదో ఓ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. నేడు ఢిల్లీలో వ్యాక్సినేషన్ ప్యానెల్ కీలక భేటీ నిర్వహించనుంది.