లయన్స్ క్లబ్ సేవలను కొనియాడిన ఎర్రబెల్లి
వరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా : సామాజిక సేవా కార్యక్రమాల్లో లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కొనియాడారు. ఆదివారం ములుగురోడ్ లోని వజ్ర గార్డెన్స్లో లయన్స్ క్లబ్ ఇంటర్నేషన్, గౌతమ్ బుధ్ద రీజియన్ మీట్లో మంత్రి పాల్గొన్నారు. లయన్స్ రీజినల్ చైర్మన్ గా నూతనంగా ఎంపికైన చెన్నమనేని జయశ్రీ , తదితరులను మంత్రి అభినందించి, సావనీర్ను విడుదల చేశారు.మన సమాజంలో ఆపదలో ఉన్న పొరుగువారికి సహకారం అందించాలనే సదుద్దేశంతో లయన్స్ క్లబ్ ఏర్పడటం అభినందనీయమన్నారు. ‘మేము సేవ చేస్తాము’ అనే నినాదముతో సమాజములో విభిన్న జాతులు మతాలు, సాంప్రదాయాలు కలిగివున్న ప్రజల మధ్య స్నేహ పూర్వక వాతావరణాన్ని కలిగిస్తూ అవసరార్థులను అవసరమైన సమయంలో ఆదుకొంటూ, ప్రపంచములోని అతిపెద్ద సభ్యులను కలిగిన స్వచ్చంధ సేవా సంస్థగా లయన్స్ క్లబ్ ప్రజల మన్నలను పొందడం గర్వకారణమని మంత్రి కొనియాడారు.
ఎలాంటి లాభాపేక్ష లేకుండా లయన్స్ క్లబ్స్ సమాజానికి పలు సామాజిక సేవలు అందించడం అభినందించదగ్గ విషయమన్నారు. పేద వర్గాలకు కార్పొరేట్ స్థాయి విద్యనందించాలన్న సంకల్పంతో ప్రభుత్వం మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని, ప్రభుత్వం చేపట్టిన బృహత్తర కార్యక్రమానికి స్వచ్చంధ సేవా సంస్థలు సూచనలు, సలహాలు అందిస్తూ.. భాగస్వామ్యం కావాలని దయాకర్ రావు పిలుపునిచ్చారు. లయన్స్ క్లబ్ ద్వారా కరోనా సమయంలో తీసుకున్న చర్యలను కొనియాడారు. ఆర్థికంగా ఎత్త ఎత్తుకు ఎదిగినా.. నలుగురుని ఆదుకున్నప్పుడే తృప్తి, పేరు ప్రఖ్యాతలు వస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు, పలువురు సామాజిక వేత్తలు పాల్గొన్నారు.