పీజీ సీట్ల భర్తీకి తుది మాప్ అప్ నోటిఫికేషన్ 

పీజీ సీట్ల భర్తీకి తుది మాప్ అప్ నోటిఫికేషన్

వరంగల్ టైమ్స్, ఎడ్యుకేషన్ డెస్క్ : పీజీ వైద్య విద్య కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి కాళోజీ హెల్త్ యూనివర్సిటీ తుది మాప్ అప్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పటివరకు 4 విడతల కౌన్సిలింగ్ పూర్తైందని యూనివర్సిటీ అధికారులు తెలిపారు. ఇప్పటికీ ఖాళీగా ఉన్న కన్వీనర్ కోటా సీట్లను ఈ తాజా నోటిఫికేషన్ ఆధారంగా భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. తుది మెరిట్ జాబితాలో అర్హులైన అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ఈ నెల 27న సాయంత్రం 4 గంటల నుంచి 28 మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రాధాన్యతా క్రమంలో కాలేజీల వారీగా వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చని తెలిపారు.

గత విడుత కౌన్సిలింగ్ లలో సీట్ అలాటై కాలేజీలలో అడ్మిషన్ తీసుకోకపోయినా, అడ్మిషన్ తీసుకొని వదిలివేసిన అభ్యర్థులు, అఖిల భారత కోటాలో ఇప్పటికే సీటు పొందిన అభ్యర్థులు ఈ కౌన్సిలింగ్ లో పాల్గొనేందుకు అనర్హులని యూనివర్సిటీ పేర్కొన్నది. ప్రస్తుతం కాళోజీ యూనివర్సిటీ, ఆలిండియా కోటా రెండింటి పరిధిలో ఏ సీటూ లేని అభ్యర్థులకు ఒకసారి మినహాయింపుగా వారిని కౌన్సిలింగ్ కు అర్హులుగా ప్రకటించడం జరిగింది.

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆల్ ఇండియా మాప్ అప్ విడత కౌన్సిలింగ్ రద్దు చేసిన కారణంగా ఆలిండియా కోటా మాప్ అప్ విడత కౌన్సిలింగ్ లో సీటు పొంది రాష్ట్ర కౌన్సిలింగ్ లో పొందిన సీటును వదులుకున్న అభ్యర్థులకు రాష్ట్ర కౌన్సిలింగ్ లో పాల్గొనడానికి అవకాశాన్ని యూనివర్సిటీ కల్పిస్తున్నట్లు తెలిపారు. మరిన్ని వివరాలకు యూనివర్సిటీ వెబ్ సైట్ www.knruhs.telangana.gov.inలో చూడొచ్చని యూనివర్సిటీ వర్గాలు తెలిపాయి.