కిన్నెర మొగిలయ్యకు కేసీఆర్ వరాలు

కిన్నెర మొగిలయ్యకు కేసీఆర్ వరాలు

వరంగల్ టైమ్స్,హైదరాబాద్ : పద్మశ్రీ దర్శనం మొగిలయ్యకు హైదరాబాద్ లో నివాస యోగ్యమైన ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణం ఖర్చు, ఇతరత్రా అవసరాల కోసం రూ. 1 కోటిని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇటీవల పద్మశ్రీ అవార్డు పొందిన కిన్నెర మెట్ల కళాకారుడు దర్శనం మొగిలయ్య ఈ రోజు ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ను కలిశారు. ఈ సందర్భంగా మొగిలయ్యను సీఎం శాలువాతో సత్కరించారు. తెలంగాణ గర్వించదగ్గ గొప్ప కళారూపాన్ని కాపాడుతున్న మొగిలయ్య అభినందనీయుడని సీఎం కొనియాడారు.కిన్నెర మొగిలయ్యకు కేసీఆర్ వరాలుమొగిలయ్యకు పద్మశ్రీ అవార్డు రావడం పట్ల సీఎం హర్షం వ్యక్తం చేశారు. పద్మశ్రీ మొగిలయ్యకు నివాసయోగ్యమైన ఇంటిస్థలంతో పాటు నిర్మాణానికి అయ్యే ఖర్చు కోటి రూపాయలను ఈ సందర్భంగా సీఎం ప్రకటించారు. ఇందుకు సంబంధించి మొగిలయ్యతో సమన్వయం చేసుకోవాలని, కావాల్సిన ఏర్పాట్లను చూసుకోవాలని, ఎమ్మెల్యే గువ్వల బాలరాజును సీఎం ఆదేశించారు. ఇప్పటికే మొగిలయ్య కళను ప్రభుత్వం గుర్తించిందని గౌరవ వేతనాన్ని కూడా అందిస్తున్నదని సీఎం తెలిపారు. తెలంగాణ కళలను పునరుజ్జీవింప చేసుకుంటూ కళాకారులను గౌరవిస్తూ వారిని ఆదుకుంటామని సీఎం పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు వి. శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి, ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.