అమరావతి : కైనెటిక్ గ్రీన్ ఎనర్జీ అండ్ పవర్ సొల్యూషన్స్ లిమిటెడ్ ఫౌండర్ అండ్ సీఈవో సులజ్జ ఫిరోదియా మొత్వాని, కో–ఫౌండర్ రితేష్ మంత్రి లు ఏపీ సీఎం వైఎస్ జగన్ ను తన క్యాంప్ కార్యాలయంలో కలిశారు. ఏపీలోరూ. 1,750 కోట్లతో ఎలక్ట్రిక్ టూ వీలర్స్, త్రీ వీలర్స్, అడ్వాన్స్డ్ టెక్నాలజీ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్, బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్స్ ఏర్పాటుచేసేందుకు కైనెటిక్ గ్రీన్ ఎనర్జీ ముందుకొచ్చినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.
కంపెనీ ప్రణాళికలను సీఎం జగన్ కు వివరించి, చర్చించారు. విశాఖలో బ్రాండెడ్ ప్రీమియం ఎలక్ట్రిక్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నెలకొల్పేందుకు కైనెటిక్ గ్రీన్ ఎనర్జీ ఆసక్తి కనపరిచినట్లు తెలిపారు. ఇందులో భాగంగా స్కిల్ డెవలప్మెంట్ అండ్ రీసెర్చ్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటుచేయనున్నట్లు తెలిపారు.
ఇప్పటికే పూణే సమీపంలోని అహ్మద్నగర్లో నెలకు 6,000 ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి సామర్ధ్యంతో కల ప్లాంట్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో పురపాలక, పట్టణాభివృద్దిశాఖ స్పెషల్ సీఎస్ వై.శ్రీలక్ష్మి, పరిశ్రమల శాఖ డైరెక్టర్ జవ్వాది సుబ్రహ్మణ్యం, సీఎంవో అధికారులు పాల్గొన్నారు.