రైతుబంధు అమలుపై రాహుల్ కు కేటీఆర్ సవాల్

రైతుబంధు అమలుపై రాహుల్ కు కేటీఆర్ సవాల్

వరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా : కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. జాతీయ పార్టీ అయినా కాంగ్రెస్ కు దమ్ముంటే, ఛత్తీస్ గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో రుణమాఫీ, రైతుబంధు పథకం అమలు చేయాలని కేటీఆర్ సవాల్ విసిరారు. వరంగల్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. 7 దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో వ్యవసాయానికి పాతరవేశారు. కానీ వ్యవసాయాన్ని జాతర చేసింది మాత్రం టీఆర్ఎస్ పార్టీ అని కేటీఆర్ స్పష్టం చేశారు. రైతుబంధు అమలుపై రాహుల్ కు కేటీఆర్ సవాల్2014లో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పుడు వరి 45 లక్షల టన్నులు పండింది. నేడు 2021టో 3 కోట్ల టన్నులు వరి పంట పండిందని తెలిపారు. 24 లక్షల టన్నులు మాత్రమే నాడు కొనుగోలు చేశారు. నేడు ఒక కోటి 41 లక్షల టన్నుల ధాన్యం సేకరించామని గుర్తు చేశారు. ఈ అభివృద్ధిని కాంగ్రెస్ నాయకులు కళ్లుండి చూడట్లేదు. కాంగ్రెస్ పార్టీ నాయకులు అజ్ఞానులని కేటీఆర్ విమర్శించారు.

ప్రత్యేక తెలంగాణ వచ్చాకే రైతుల ఆత్మహత్యలు అత్యల్పం..
టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతుల ఆత్మహత్యలు తగ్గాయని నేషనల్ క్రైం బ్యూరో రికార్డులు చెబుతున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు. 16వేల పై చిలుకు ఆత్మహత్యలు కాంగ్రెస్ హయాంలో జరిగాయని ఆ రికార్డులు తెలుపుతున్నాయని అన్నారు. ఇండియాలో అత్యల్పంగా రైతుల ఆత్మహత్యలు తెలంగాణలో ఉన్నాయని పార్లమెంట్ లోనే కేంద్రం ప్రకటించిందన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అత్యధికంగా రైతుల ఆత్మహత్యలు తగ్గింది తెలంగాణలోనే అని చెప్పారు. ఈ ప్రశ్నను అడిగింది కూడా మీ గాడ్సే అని కేటీఆర్ గుర్తు చేశారు. ఇదే గాడ్సే అడిగితే అదే కేంద్రం చెప్పిందని కేటీఆర్ పేర్కొన్నారు.

ఏఐసీసీ అంటే ఆల్ ఇండియా క్రైసిస్ కమిటీ..
నిన్న హనుమకొండలో జరిగింది రైతు సంఘర్షణ సభ కాదని కేటీఆర్ విమర్శించారు. ఏఐసీసీ అంటే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కాదు, ఆల్ ఇండియా క్రైసిస్ కమిటీ అని కేటీఆర్ విమర్శించారు. కేంద్రంలో అసమ్మతి లొల్లి, రాష్ట్రంలో నలుగురు నాయకులు కలిసి ఉండలేరు. అలా కాంగ్రెస్ పార్టీలో గందగోళ పరిస్థితి ఏర్పడిందన్నారు. ఆదర్శ రైతులున్న పంజాబ్ లో మొన్నటి వరకు కాంగ్రెస్ అధికారంలో ఉంటే, ఇటీవల జరిగిన ఎన్నికల్లో మిమ్మల్ని తరిమికొట్టారు. మీరు నిన్న చెప్పిన రూ.2లక్షల రుణమాఫీ ఇది వరకు చెప్పలేదా ? కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఎప్పుడూ నమ్మరని అన్నారు.

మీరు అధికారంలో ఉన్న ఛత్తీస్ గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ముందు రుణమాఫీ, రైతు బంధు అమలు చేసి పెట్టాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. జాతీయ పార్టీ డిక్లరేషన్ ఒక్కో రాష్ట్రానికి ఒక్కో విధంగా ఉంటుందా ? జాతీయ పార్టీకి జాతీయ విధానాలు ఉండవా ? అని కేటీఆర్ ప్రశ్నించారు.