సరూర్ నగర్ లో హత్య కేసు..నిందితులు అరెస్ట్

సరూర్ నగర్ లో హత్య కేసు..నిందితులు అరెస్ట్

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : సరూర్ నగర్ వ్యక్తి హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. సరూర్ నగర్ లో బైక్ పై వెళ్తున్న యువతి, యువకుడిని కొందరు అడ్డుకున్నారు. యువతిని పక్కకు నెట్టేసి యువకుడిపై కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో యువకుడు నాగరాజు అక్కడికక్కడే మృతి చెందారు. కేసునమోదు చేసిన పోలీసులు, దర్యాప్తులో పరువు హత్యగా గుర్తించారు.

ఇద్దరు నిందితులు మూబిన్ అహ్మద్, మసూద్ అహ్మద్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా సరూర్ నగర్ కు చెందిన నాగరాజు, సుల్తానా బాల్య స్నేహితులు. కాలం గడిచేకొద్ది వారి మధ్య ఉన్న స్నేహం కాస్త ప్రేమగా మారింది. దీంతో వాళ్లిద్దరూ జనవరి నెలలో పెళ్లి చేసుకున్నారు. తమ చెల్లెలు సుల్తానా మతాంతర వివాహం చేసుకోవడం సుల్తానా సోదరులు మూబిన్ అహ్మద్, మసూద్ అహ్మద్ కు ఇష్టం లేదు. చెల్లిని పెళ్లి చేసుకున్న నాగరాజుపై కక్ష పెంచుకున్నారు. అదను కోసం ఎదురు చూశారు. సుల్తానా, నాగరాజు సరూర్ నగర్ లో బైక్ పై వెళ్తుండగా అడ్డుకున్నారు.

అందరూ చూస్తుండగానే నాగరాజును సుల్తానా సోదరులు మూబిన్ అహ్మద్, మసూద్ అహ్మద్ విచక్షణా రహితంగా కత్తులతో దాడి చేశారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు, స్థానిక సీసీ ఫుటేజీలను పరిశీలించారు. దీంతో నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. తమ చెల్లెలిని పెళ్లి చేసుకున్నాడన్న కోపంతోనే నాగరాజును మూబిన్ అహ్మద్, మసూద్ అహ్మద్ హత్య చేశారని పోలీసులు తెలిపారు. నిందితులిద్దరిని రిమాండ్ కు తరలిస్తామని చెప్పారు.