ప్రీ క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్సీ కవిత

ప్రీ క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్సీ కవితహైదరాబాద్: రాష్ట్రంలో సర్వ మతాలకు ప్రాధాన్యత ఇచ్చిన ఉన్నతమైన వ్యక్తి సీఎం కేసీఆర్ అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ప్రీ క్రిస్మస్ వేడుకల్లో భాగంగా బోడుప్పల్ లోని చెరిష్ ఫౌండేషన్ లో జరిగిన కేక్ మిక్సింగ్ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మంత్రి మల్లారెడ్డితో పాటు ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర సమగ్ర అభివృద్ధి జరుగుతుందని , సర్వమతాలకు ప్రాధాన్యతనిచ్చే గొప్ప నాయకుడు కేసీఆర్ అని ఆమె సీఎంని కొనియాడారు. ఈ వేడుకల్లో భాగంగా 45 మంది బాలబాలికల చదువులకు సహకారం అందిస్తామని కవిత హామీ ఇచ్చారు. గత 16ఏళ్లుగా చెరీష్ ఫౌండేషన్ ను నిర్వహిస్తూ అనాథ పిల్లలకు ఆశ్రయమిస్తున్న డేవిడ్ సుబ్రమణ్యంకు ఆమె అభినందనలు తెలిపారు.ఆశ్రమంలో ఉన్న 45 మంది బాలబాలికలు తన కుటుంబసభ్యులతో సమానం అని మాట్లాడారు. ఆశ్రమానికి సొంత స్థలం కేటాయించేందుకు ప్రయత్నిస్తామని ఆమె హామీ ఇచ్చారు. ఫౌండేషన్ లో ఆశ్రయం పొందుతున్న బాలబాలికలు ఉన్నత చదువులు చదువుకుని, ఉద్యోగాలు సాధించేందుకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని మంత్రి మల్లారెడ్డి ప్రకటించారు. ప్రీ క్రిస్మస్ వేడుకల్లో భాగంగా ఆశ్రమంలోని బాలబాలికలు ప్రార్థనలు, భక్తిగీతాలు ఆలపించారు.ఈ కార్యక్రమంలో మేడ్చల్ జెడ్పీ చైర్మన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, బోడుప్పల్ మేయర్ బుచ్చిరెడ్డి, ఫిర్జాదీగూడ మేయర్ జక్క వెంకట్ రెడ్డి, తెలంగాణ జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజీవ్ సాగర్ పాల్గొన్నారు.