హైదరాబాద్: కలెక్షన్ కింగ్ డా. మోహన్బాబు మనవరాలు, ప్రముఖ నటి మంచు లక్ష్మీ ప్రసన్న కూతురు విధ్యా నిర్వాణ మంచు ఆనంద్ `యంగెస్ట్ చెస్ ట్రైనర్`గా నోబెల్ బుక్ ఆప్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించుకుంది. డిసెంబర్ 19న నోబెల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధి డా. చోకలింగం బాలాజి సమక్షంలో జరిగిన పరీక్షల్లో ఉత్తీర్ణురాలై ఈ రికార్డ్ సొంతం చేసుకుంది. చెస్ ట్రైనింగ్ నిర్వహకులతో పాటు మోహన్ బాబు కుటుంబసభ్యుల్లో సంతోషం వెల్లువిరిసింది. ఆరేళ్ల వయసులో వున్న విధ్యా నిర్వాణ మంచు ఆనంద్ ప్రతిభను గత యేడాదే గమనించిన చెస్ ట్రైనర్ నిర్వహకులు కార్తీక్, నోబెల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధి డా. చోకలింగం బాలాజీలు మంచు లక్ష్మీకి చెప్పినప్పటికీ తాను నిరాకరించింది. అయితే ఈ యేడాది మాత్రం మంచు లక్ష్మి నేరుగా ఫోన్ చేసి తనకి ట్రైనింగ్ ఇవ్వాలని అడగడంతో చెస్ శిక్షణ మొదలు పెట్టామని వారు తెలిపారు. చెస్ ట్రైనింగ్ మొదలుపెట్టిన నాలుగైదు క్లాసుల్లోనే ఎంతో చురుకుగా గేమ్ ని పూర్తిగా నేర్చుకుంది విధ్యానిర్వాణ. ఆ తర్వాత తన స్నేహితులకు చెస్ గేమ్ నేర్పించడం మొదలుపెట్టింది. రెండు వారాల్లోనే విధ్యా నిర్వాణ టాలెంట్ ను గమనించిన ట్రైనర్ కార్తిక్ నోబెల్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో అప్లై చేశాడు. ఇంకేముంది. ఇంత చిన్న వయసులోనే విధ్యా నిర్వాణ యంగెస్ట్ చెస్ ట్రైనర్ గా నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో స్థానం సంపాదించుకోవడంతో తల్లి మంచు లక్ష్మి తో పాటు, తాత మోహన్ బాబు, చెస్ ట్రైనర్ కార్తిక్, నోబెల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధి డా. చోకలింగం బాలాజి ఫుల్ ఖుషీ అవుతున్నారు. “చెస్ అనేది కేవలం ఆట మాత్రమే కాదు అదొక లైఫ్ స్కిల్ అని నేను నమ్ముతాను, అందుకే తన కూతురుకు చెస్ నేర్పించానని తల్లి మంచు లక్ష్మి తెలిపింది. తల్లిగా తనకెంతో గర్వంగా వుందని ఆమె అన్నారు.ఇక తాత మోహన్ బాబు మాత్రం ఈ రికార్డు లో స్థానం సంపాదించుకున్నందుకు ఒక తాతగా ఎంతో గర్వంగా ఫీలవుతున్నానని అన్నారు. పిల్లలకు చదువుతోపాటు ఏ రంగంలో ఆసక్తి ఉందో దానికి కొంత సమయం కేటాయిస్తే తప్పకుండా ప్రతిఒక్కరూ గొప్ప స్థాయికి చేరుకుంటారని తల్లిదండ్రులకు సూచించారు. మా అందరి బ్లెస్సింగ్స్తో గ్రేట్ నిర్వాణ కావాలని కోరుకుంటున్నాను“ అంటూ నటుడు మోహన్ బాబు ఆనందం వ్యక్తం చేశారు.