ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత ఏకగ్రీవం

ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత ఏకగ్రీవంనిజామాబాద్ జిల్లా : తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థులుగా కల్వకుంట్ల కవిత, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి, నిజామాబాద్ జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి నుంచి శుక్రవారం కల్వకుంట్ల కవిత ధ్రువీకరణ పత్రాన్ని అందుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ , ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు తదితరులు ఉన్నారు.

అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఏక గ్రీవంగా ఎన్నికైన పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి ఎన్నికల రిటర్నింగ్ అధికారి, బి గోపి ధ్రువీకరణ పత్రం అందచేశారు. పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు , సత్యవతి రాథోడ్ లు శుభాకాంక్షలు తెలిపారు.

ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, వరంగల్ , మహబూబాబాద్ ఎంపీలు పసునూరి దయాకర్ , కవిత, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, బండ ప్రకాష్, ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, అరూర్ రమేష్, చల్లా ధర్మారెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, టి. రాజయ్య, గండ్ర వెంకటరమణారెడ్డి, రెడ్యానాయక్, జడ్పీ చైర్మన్ సంపత్ రెడ్డి, జగదీశ్వర్, డిసిసిబి చైర్మన్ రవీందర్ రావు, టీఆర్ఎస్ జెడ్పీటీసీలు, ఎంపీపీలు, పార్టీ ముఖ్య నేతలు తదితరులు కలెక్టరేట్ ఎదుట పెద్ద ఎత్తున పటాకులు పేల్చి సంబురాలు జరుపుకున్నారు.

ఆదిలాబాద్ జిల్లాలో 1, నల్లగొండ-1, మెదక్-1, ఖమ్మం-1, కరీంనగర్ జిల్లాలో 2 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు డిసెంబర్ 10న జరుగనున్నాయి. ఆదిలాబాద్ నుంచి దండె విఠల్, నల్లగొండ నుంచి ఎంసీ కోటిరెడ్డి, ఖమ్మం నుంచి తాతా మధు, మెదక్ నుంచి డాక్టర్ వంటేరి యాదవరెడ్డి, కరీంనగర్ నుంచి భానుప్రసాద్ రావు, ఎల్ రమణ బరిలో ఉన్నారు.