రాష్ట్రపతి ప్రసంగాన్ని విమర్శించిన విపక్షాలు

రాష్ట్రపతి ప్రసంగాన్ని విమర్శించిన విపక్షాలు

రాష్ట్రపతి ప్రసంగాన్ని విమర్శించిన విపక్షాలు

వరంగల్ టైమ్స్, ఢిల్లీ : బడ్జెట్‌ సమావేశాల నేపథ్యంలో ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేసిన ప్రసంగంపై విపక్ష పార్టీలు పెదవి విరిచాయి. రాష్ట్రపతి చేసిన ప్రసంగంలో కొత్తగా ఏమీ లేదన్నాయి. ప్రభుత్వం ఏది చెబితే దాని గురించే రాష్ట్రపతి మాట్లాడారని విమర్శలు గుప్పించాయి. ముఖ్యంగా ధరల నియంత్రణ,మత సామరస్యం,మహిళా సమస్యల ఊసే లేదని పేర్కొన్నాయి. రాష్ట్రపతి ప్రసంగం పేద ప్రజలు, నిరుద్యోగులను ఏ మాత్రం సంతృప్తి పరచలేదని పేర్కొన్నాయి.

‘రాష్ట్రపతి చేసిన ప్రసంగంలో మాదిరిగా అంతా మంచే ఉంటే ద్రవ్యోల్బణం, నిరుద్యోగంతో ప్రజలు బాధపడేవారు కాదు. అవినీతి తొలగించామని ప్రభుత్వం చెబుతోంది. మరి కేవలం ఒక్క వ్యక్తి ఎల్‌ఐసీ/ఎస్బీఐతో పాటు ఇతర బ్యాంకులను ఎలా మోసం చేయగలుగుతారు. ఎల్‌ఐసీలో పెట్టుబడులు పెట్టిన 30కోట్ల మంది ఇప్పుడు బాధపడుతున్నారు. అటువంటి వ్యక్తులపై మాత్రం చర్యలు లేవు’ అని కాంగ్రెస్‌ అధినేత మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు.

రాష్ట్రపతి ప్రసంగంలో కొత్తగా ఏమీ లేదన్న ఆయన రాష్ట్రపతి నిష్పాక్షికంగా వ్యవహరిస్తారు కాబట్టి వ్యక్తిగతంగా అందరూ స్వాగతిస్తారని అన్నారు. రాష్ట్రపతిపై ఎటువంటి విమర్శలు చేయడం లేదని కేవలం నరేంద్ర మోడీ బయట చెప్పిన విషయాలనే పేర్కొన్నారని తెలిపారు.పేదరికం, ధరల పెరుగుదల, నిరుద్యోగంతో బాధపడుతోన్న ప్రజలను రాష్ట్రపతి చేసిన ప్రసంగం సంతృప్తి పరచలేదని బీఎస్పీ అధినేత్రి మాయావతి పేర్కొన్నారు. ప్రజలు సంతోషంగా ఉన్నప్పుడే దేశం పురోగతి సాధించినట్లు అవుతుందని అన్నారు.

ప్రభుత్వం రాసిచ్చిన నివేదికనే రాష్ట్రపతి చదవడం సంప్రదాయంగా వస్తున్నప్పటికీ కీలక సమస్యలను ప్రస్తావించకపోవడం బాధాకరమని తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ డేరెక్‌ ఓబ్రెయిన్‌ అన్నారు. ఉద్యోగాల కల్పన, ధరల నియంత్రణ, సమాఖ్య స్ఫూర్తిని పెంపొందించడం, మతసామరస్యాన్ని పెంచడం, మహిళా రిజర్వేషన్‌ బిల్లు ఆమోదం వంటి అంశాలు మిస్సయ్యాయని విమర్శించారు. మహిళలు, యువత, దళిత, వెనుకబడిన తెగలవారి సాధికారత కేవలం పేపర్లకే పరిమితమైందని సీపీఐ ఎంపీ బినోయ్‌ విశ్వమ్‌ పేర్కొన్నారు. మరోవైపు రాష్ట్రపతి ప్రసంగాన్ని బీఆర్ఎస్, ఆమ్ఆద్మీ పార్టీలు బహిష్కరించడాన్ని బీజేపీ తీవ్రంగా తప్పుపట్టింది.