జూలై రెండో వారం నుంచి స్కూల్స్ : మంత్రి సబితా
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పాఠశాలలు జూలై రెండో వారంలో ప్రారంభించే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్టు తెలంగాణ విద్యాశాఖ తెలిపారు. పదోతరగతి పరీక్షలు జూలై 5 వరకు ఉన్నందున, ఆ తర్వాత పాఠశాలలు ప్రారంభిస్తామన్నారు. ఈ అంశంపై త్వరలో క్యాబినెట్ సబ్కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్టు శుక్రవారం ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు, విద్యాశాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె తెలిపారు.
ఆగస్టు నెల ప్రారంభం నుంచి ఇంటర్మీడియట్, డిగ్రీ, ఇంజినీరింగ్ తరగతులు ప్రారంభించే ప్రతిపాదనలు క్యాబినెట్ సబ్కమిటీ ముందు ఉంచనున్నారు. వేసవి సెలవులు ముగిసిన వెంటనే జూన్ 12 నుంచి ఉపాధ్యాయులంతా విధుల్లో చేరాల్సి ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. సమావేశంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు కాటేపల్లి జనార్దన్రెడ్డి, రఘోత్తంరెడ్డి, ఏ నర్సిరెడ్డి, పాఠశాల విద్యాశాఖ, ఇంటర్మీడియట్, ఉన్నత విద్యాశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.