అలా అయితేనే పార్టీలో చేరతా :మాజీ జేడీ

అలా అయితేనే పార్టీలో చేరతా :మాజీ జేడీ

అలా అయితేనే పార్టీలో చేరతా :మాజీ జేడీవరంగల్ టైమ్స్, అమరావతి : మాజీ జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు.రాజధాని అంశం, ఇతర రాజకీయ ప్రణాళికలపై స్పష్టత ఇచ్చారు. ఏపీలో మూడు రాజధానుల అంశంపైన చర్చ జరుగుతున్న వేళ తన అభిప్రాయాలను స్పష్టం చేశారు. రెండు వేల రూపాయాల నోట్లు కనిపించటం లేదన్నారు. కొంతమంది నాయకులు నల్లధనంగా దాచుకొనేందుకు ఉపయోగపడుతోందని ఎద్దేవా చేశారు. ఏపీలో విభజన సమస్యలపైన లక్ష్మీనారాయణ మరోసారి స్పందించారు. తాను విశాఖ నుంచే పోటీ చేస్తానని మాజీ జేడీ పునరుద్ఘాటించారు. తాను ఏ పార్టీలో అయినా చేరాలంటే తన అభిప్రాయం ఏంటో వెల్లడించారు. రాజధానుల వ్యవహారం పైన ప్రస్తుతం చోటు చేసుకుంటున్న పరిణామాలను ప్రస్తావించిన లక్ష్మీనారాయణ, ప్రభుత్వానికి కీలక సూచన చేశారు.

*అసెంబ్లీ నిర్ణయం మార్పు సరి కాదు..
ఏపీలో ప్రస్తుతం మూడు రాజధానుల వ్యవహారంపైన చర్చ సాగుతోంది. సుప్రీం కోర్టులో రాజధాని కేసు విచారణలో ఉంది. ఇటు వచ్చే నెల 14న ప్రారంభమయ్యే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో విశాఖ నుంచి పాలన పైన ప్రకటన చేస్తారని చెబుతున్నారు. ఉగాది నుంచి సీఎం వైఎస్ జగన్ తన క్యాంపు కార్యాలయం విశాఖ కేంద్రంగా ప్రారంభించేందుకు సిద్దమయ్యారని ప్రచారం సాగుతోంది. ఇదే సమయంలో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. శాసనసభలో అమరావతిని రాష్ట్ర రాజధానిగా నిర్ణయించారని ఆయన గుర్తు చేశారు. దానిని మార్చటం సరి కాదన్నారు. కొన్ని భవనాలు, కార్యాలయాలు పెట్టినంత మాత్రాన ఆ ప్రాంతం డెవలప్ చెందదని లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. అన్ని జిల్లాలను సమకోణంతో చూడాలని సూచించారు. దీని ద్వారా అమరావతి రాజధానిగా కొనసాగించాలని లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు.

*రద్దు చేయటం ఉత్తమం..
ఆర్దిక వ్యవస్థను పటిష్టపరిచే సత్తా బ్యాంకులకే ఉందని లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. బ్యాంకింగ్ రంగంలో ఎక్కడ స్కాం జరిగినా దానిని ప్రతీ ఉద్యోగి కేసు స్టడిగా తీసుకొని జాగ్రత్త పడాలని సూచించారు. తనకు ఉన్న అవగాహన మేరకు రెండు వేల రూపాయల నోట్లు బయట కనిపించటం లేదన్నారు. కొంత మంది నాయకులు నల్లధనంగా దాచుకోవటానికే ఉపయోగపడుతున్నాయంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. పాత నోట్ల రద్దు ఉద్దేశం నెరవేరలేదన్నారు. రూ 2 వేల నోట్లు రద్దు చేయటం ఉత్తమమని లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు. దేశంలో రుణాలిచ్చే బ్యాంకులు ఇన్ని ఉండగా ప్రజలు లోన్ యాప్ లను ఎందుకు ఆశ్రయిస్తున్నారో గమనించాలని సూచించారు. విరివిగా రుణాలు అందేలా బ్యాంకులు చర్యలు తీసుకోవాలన్నారు.

*అలా అయితే పార్టీలో చేరుతాను..
తాను వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచి పోటీ చేస్తానని లక్ష్మీనారాయణ మరో సారి తేల్చి చెప్పారు. తన ఆలోచనలకు, ఆశయాలను అనుగుణంగా ఉన్న పార్టీ తరపునే తాను ఎంపీగా పోటీ చేస్తానని స్పష్టం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ, విశాఖకు ప్రత్యేక రైల్వే జోన్ అంశాలను ఎన్నికల ప్రణాళికలో పెట్టిన పార్టీలోనే తాను చేరుతానని స్పష్టం చేశారు. అలాంటి పార్టీలు లేకపోతే తాను స్వతంత్రంగా పోటీ చేస్తానని స్పష్టం చేశారు.

గత ఎన్నికల్లో విశాఖ ఎంపీగా జనసేన నుంచి పోటీ చేసి ఓడిన లక్ష్మీనారాయణ, వచ్చే ఎన్నికల కోసం ముందు నుంచే వ్యూహాత్మకంగా విశాఖ అంశాల పైన ప్రత్యేకంగా ఫోకస్ చేశారు. స్టీల్ ప్లాంట్ అంశం పైన న్యాయపోరాటం చేస్తున్నారు. ఇప్పుడు స్వతంత్ర అభ్యర్ధిగా అయినా పోటీకి సిద్దమని చెబుతున్నారు. దీంతో లక్ష్మీనారాయణ ఎన్నికల నాటికి ఏదైనా పార్టీలో చేరుతారా, లేదా స్వతంత్ర అభ్యర్ధిగానే బరిలో నిలుస్తారా అనేది చూడాలి.