హైదరాబాద్: బీజేపీ నేతలు మత విద్వేషాలు రెచ్చగొట్టి ఎక్కువ సీట్లు గెలుపొందారని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరీ ఎంపీ రేవంత్రెడ్డి విమర్శించారు. శుక్రవారం గ్రేటర్ ఫలితాలు వెలువడిన తరువాత ఆయన గాంధీభవన్లో మీడియాతో మాట్లాడారు. కేంద్రం నుంచి బీజేపీ అగ్రనేతలు వచ్చి ఎన్నికల ప్రచారం నిర్వహించారన్నారు. అలాగే టీఆర్ఎస్ తరుపున మంత్రి కేటీఆర్ గల్లీలో తిరిగాడన్నారు. రెండు పార్టీలు గెలుపుకోసం సర్వశక్తలు ఒడ్డాయన్నారు. తెలంగాణలో ప్రతి రాజకీయ పార్టీకి ఒక ఛానెల్ , పేపర్ ఉందని అన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక రాజకీయపార్టీ ఒక ఛానెల్ పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి ప్రధానం కారణం మీడియానే ఆయన ఎద్ధేవా చేశారు. తమకు 2016 కంటే ఓటు బ్యాంక్ దాదాపు 4 శాతం పెరిగిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.