ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్‌..!

ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్‌..!ఢిల్లీ : ఎస్బీఐ ఫిబ్రవరి 1 నుంచి తక్షణ చెల్లింపు సేవ(ఐఎంపీఎస్‌) ఛార్జీలను పెంచుతోంది. ఎస్బీఐ బ్యాంక్ బ్రాంచ్‌లో ఐఎంపీఎస్‌ ద్వారా చేసే నగదు బదిలీకి ఛార్జీ విధించనుంది. డిజిటల్‌ బ్యాంకింగ్‌ సేవలను ప్రొత్సహించేందుకు ఎస్బీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. యోనో బ్యాంకింగ్‌ ద్వారా రూ. 5 లక్షల వరకు ఐఎంపీఎస్‌ సేవలకు ఎలాంటి సర్వీస్‌ ఛార్జ్‌, జీఎస్టీ వర్తించదు. బ్యాంకుల్లో చేసే ఐఎంపీఎస్‌ లావాదేవీలకు ఫిబ్రవరి 1 నుంచి కొత్త ఐఎంపీఎస్‌ ఛార్జీని అమలు చేయనున్నట్లు ఎస్బీఐ తమ ఖాతాదారులను ఇప్పటికే అలర్ట్‌ చేసింది.

ఐఎంపీఎస్‌ ద్వారా ఖాతాదారులు 2 లక్షల నుంచి 5 లక్షల రూపాయల వరకు పంపితే రూ. 20తో పాటుగా జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుందని తెలియచేసింది. ఐఎంపీఎస్‌ సేవలతో డబ్బులను ఒక బ్యాంకు ఖాతా నుంచి మరొక బ్యాంకు ఖాతాకు సెకన్లలో బదిలీ చేయవచ్చును.సెలవు దినాలలో కూడా నగదు బదిలీ జరుగుతుంది.

కొత్త ఛార్జీలు ఇలా ఉన్నాయి..!
రూ. 5 లక్షల వరకు ఇంటర్నెట్‌ లేదా మొబైల్‌ బ్యాంకింగ్‌ ద్వారా చేసే ఏదైనా ఐఎంపీఎస్‌ లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు ఉండవు. వీటిలో యోనో యాప్‌ లావాదేవీలకు కూడా వర్తించనుంది. ఐఎంపీఎస్‌ లావాదేవీల్లో భాగంగా రూ.1,000 నుంచి రూ.10,000 వరకు బదిలీ చేస్తే రూ. 2తో పాటు జీఎస్టీ చెల్లించాలి. రూ.10,000 నుంచి రూ.1,00,000 వరకు ఐఎంపీఎస్‌ లావాదేవీపై రూ. 4తో పాటుగా జీఎస్టీ చెల్లించాలి.

రూ.1,00,000 నుంచి రూ.2,00,000 వరకు జరిపే లావాదేవీలపై రూ.12తో పాటు జీఎస్టీని ఛార్జ్‌ చేయనుంది. తాజాగా ఎస్బీఐ రూ.2,00,000 నుంచి రూ.5,00,000 వరకు కొత్త స్లాబ్‌ను యాడ్‌ చేసింది. ఈ నగదు లావాదేవీలపై రూ. 20 పాటు జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది.