వరంగల్ టైమ్స్, అమరావతి: భారత క్రికెట్ అండర్ 19 జట్టు వైస్ కెప్టెన్ షేక్ రషీద్ ఏపీ సీఎం వైఎస్ జగన్ ను సీఎం క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసారు. ఈసందర్భంగా షేక్ రషీద్ ను సీఎం జగన్ అభినందించారు. ప్రభుత్వం తరపున పలు ప్రోత్సాహకాలు, రూ. 10 లక్షల నగదు బహుమతి, గుంటూరులో నివాస స్ధలం కేటాయిస్తున్నట్లు సీఎం ప్రకటించారు. ప్రభుత్వం తరపున పూర్తి సహాయసహకారాలు అందిస్తామని హమీ ఇచ్చారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరపున ప్రకటించిన రూ. 10 లక్షల చెక్ సీఎం చేతుల మీదుగా షేక్ రషీద్ కు అందజేశారు.
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం పాతమల్లాయపాలెం వాసి అయిన 17 యేళ్ల షేక్ రషీద్ సామాన్య కుటుంబం నుంచి వచ్చి అంతర్జాతీయ క్రికెట్లో రాణిస్తూ క్రికెట్ లవర్స్ను ఆకట్టుకుంటున్నాడు. టీమిండియా యువ జట్టు ఆసియా కప్ గెలవడంలోనూ, అండర్ 19 వరల్డ్ కప్ను ఐదోసారి గెలవడంలోనూ కీలకపాత్ర పోషించాడు. షేక్ రషీద్ ను అభినందించిన వారిలో హోంమంత్రి మేకతోటి సుచరిత, పర్యాటక, క్రీడల శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, రషీద్ తండ్రి బాలీషా, ద ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సభ్యులు, శాప్ అధికారులు ఉన్నారు.