ఏపీ పంచాయతీరాజ్‌ చట్టం సవరణ బిల్లు ఆమోదం

‘ఏపీ పంచాయతీరాజ్‌ చట్టం సవరణ బిల్లు–2020’ను ఆమోదించిన సభ
అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభంఏపీ పంచాయతీరాజ్‌ చట్టం సవరణ బిల్లు ఆమోదంఅమరవతి: అసెంబ్లీ శీతాకాల సమావేశాల తొలి రోజున శాసనసభ వ్యవహారాల కమిటీ (బీఏసీ) సమావేశం తర్వాత సభ తిరిగి ప్రారంభం కాగానే ఏపీ పంచాయతీ రాజ్‌ చట్టం సవరణ బిల్లు–2020 ని సభలో ఆ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సభా నాయకుడు, సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడారు. పంచాయతీరాజ్‌ చట్టానికి సంబంధించి గతంలోనే సభలో చర్చ జరిగిందని ఇంతకు ముందే ఈ బిల్లు తీసుకువచ్చామన్నారు. ఇక్కడ ఆమోదం పొందిన తర్వాత మండలికి పంపిస్తే వారు బిల్లుల్ని వెనక్కి పంపించారని దుయ్యబట్టారు. ఆ తర్వాత మళ్లీ వారు నో చెప్పడానికి వీలు లేకుండా పోయిందన్నారు. ఇక్కడ 151 మంది శాసనసభ్యులు ఉన్న ఇదే సభలో ప్రభుత్వం గతంలో ఏమనుకుందో దాన్నే తిరిగి ఆమోదిస్తున్నట్లు తెలిపారు. ఇది కేవలం ఫార్మాలిటీ మాత్రమేనని పేర్కొన్నారు. అయితే ఇది కొత్తగా పెడుతున్నట్లు వారికి ఏమీ తెలియనట్లు విచిత్రంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఇప్పుడు మళ్లీ కొత్తగా బిల్లు పెడతున్నట్లు అభ్యంతరం చెబుతున్నారని వివరించారు. ఎన్నికల్లో ఎవరైనా ఓటర్లను ప్రభావితం చేసే విధంగా డబ్బు ఖర్చు పెడితే ఆ తర్వాత వారిపై చర్య తీసుకునే విధంగా వినూత్నంగా ఈ చట్టం చేస్తున్నామన్నారు. ఎన్నికల్లో ఎవరూ డబ్బు ఖర్చు పెట్టకుండా చేయడం కోసమే ఈ చట్టం సవరణ చేశామని తెలిపారు. అదే విధంగా ఎన్నికల ప్రక్రియ ఆలస్యం లేకుండా త్వరితగతిన పూర్తయ్యేలా మార్పులు చేస్తున్నామని సూచించారు. దీనిపై గతంలోనే విస్తృత చర్చ జరిగిందని తెలిపారు. చంద్రబాబు ఏం మాట్లాడుతున్నాడో అర్ధం కావడం లేదు’ అని స్పష్టం చేశారు. ఆ తర్వాత ఏపీ పంచాయతీరాజ్‌ చట్టం సవరణ బిల్లు–2020ను సభ ఆమోదించింది.