భోగి (రేగి) పండ్లు ఎందుకు పోస్తారు..

భోగి (రేగి) పండ్లు ఎందుకు పోస్తారు..

భోగి (రేగి) పండ్లు ఎందుకు పోస్తారు..

వరంగల్ టైమ్స్, డెవోషనల్ డెస్క్ : భోగి రోజు అన్ని చెడు కర్మలు తొలగాలి అని పాత వస్తువులు భోగి మంటలో వేస్తారు. ఆ బోగి నుండి దీపం తెచ్చి ఇంట్లో దేవుడి ముందు ఉంచుతారు. ఇది సంప్రదాయం. దాంతో పాటు ఆ రోజు సాయంత్రం ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు భోగి పండ్లు పోస్తారు. పిల్లలకు 5 యేళ్ల లోపు ఉండే బాల అరిష్టాలు, దిష్టి తొలగిపోయి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుని ఈ రేగి పండ్లు పోస్తారు. ఆ వయసు పిల్లలకు బ్రహ్మ రంధ్రం పలుచగా ఉంటుంది. రేఖి అరా కూడా పలచగా ఉంటుంది. ఈ రేగి పండ్లకి రోగనిరోధక శక్తిని ఇచ్చే పోషక విలువలు ఉంటాయి. అవి పోసిన సమయంలో రేగి పండ్ల నుండి వచ్చే వాయువు పిల్లల తలపైన బ్రహ్మ రంధ్రానికి శక్తిని ఇస్తుంది. మేధస్సుకి శక్తి వస్తుంది. ఈ పండ్లు తలపైన నుండి పడటం వల్ల తలలోని మెదడులోని నరాలు రేగి పండ్ల నుండి వచ్చే వాయువు వల్ల ఆక్టివ్ అవుతారు.

శీతాకాలంలో వచ్చే జబ్బుల వల్ల పిల్లలు మెతక బడిపోతారు. ఈ రేగి పళ్లను తినడం వల్ల పిల్లలకు ఆరోగ్యం లభిస్తుంది. ఇది ఒక శాస్త్రీయ సంప్రదాయం అలాగే చుట్టూ ఉండే అరా బలపడుతుంది. ఎటువంటి పరిస్థితులు అయినా ఎదురుకునే శక్తి పిల్లలకు రావాలి అనే ఉద్దేశంతో ఈ రేగి పండ్లనే పోస్తారు. అలాగే పిల్లలకు ఉన్న దిష్టి ప్రభావం తగ్గుతుంది. చుట్టు పక్కల వారు కూడా వచ్చి రేగి పండ్లు పోయడం వల్ల పిల్లలకు అందరి ఆశీర్వాదం కలుగుతుంది. రేగుపళ్లలో ‘సి’ విటమిన్‌ చాలా ఎక్కువగా ఉంటుంది. పైగా జీర్ణసంబంధమైన వ్యాధులను నివారించేందుకు, ఉదరసంబంధ ఇబ్బందుల నుంచి ఉపశమనం కలిగించేందుకు రేగుపళ్లు ఉపయోగపడతాయి. అందుకే రేగుపళ్లని ఎండపెట్టి వాటితో వడియాలను, రేగుతాండ్రనూ చేసుకుని తినే అలవాటు ఇప్పటికీ తెలుగునాట ఉంది.

ఇంకో కారణం భోగి ముగిసాక సూర్యుడు దక్షిణాయణం నుంచి ఉత్తరాయణానికి మరలుతాడు. ఆ రోజే మకర రాశిలోకి అడుగుపెడతాడు. సంక్రాంతి సూర్యుడి పండుగ. కాబట్టి సూర్యున్ని పోలిన గుండ్రని రూపం, ఎర్రటి రంగు కారణంగా దీనికి ‘అర్కఫలం’ అనే పేరు వచ్చింది. సూర్యభగవానుడి ఆశీస్సులు పిల్లవాడికి లభించాలనే సూచనగా ఈ భోగి పండ్లను పోస్తారు.

రేగి పండ్లను బదరీఫలం అంటారు ఎందుకు?
సాక్షాత్తూ ఆ నరనారాయణులు ఈ బదరీ వృక్షం (రేగుచెట్టు) వద్ద ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారనీ, ఆ ఫలాలని తింటూ తమ తపస్సుని కొనసాగించారని ప్రతీతి. వారు తపస్సు చేసే సమయంలో దేవతలు వారి తలపైన రేగి పండ్లు కురిపించారు అంటారు. అందుకే ఆ ప్రదేశానికి బదరీక్షేత్రం అన్నపేరు వచ్చిందని చెబుతారు. భారతీయ వాతావరణానికి తగినట్లుగానే రేగు చెట్టు ఎలాంటి ఒడుదొడుకులనైనా ఎదుర్కొని పెరుగుతుంది. -15 డిగ్రీల నుంచి విపరీతమైన 50 డిగ్రీల వరకూ ఎలాంటి ఉష్ణోగ్రతనైనా తట్టుకుని నిలబడుతుంది.

మన దేశంలోనే కాకుండా తూర్పుదేశాలన్నింటిలోనూ రేగుని తమ సంప్రదాయ వైద్యంలో వాడతారు. జలుబు దగ్గర నుంచీ సంతానలేమి వరకూ రేగుని అన్నిరకాల రుగ్మతలకీ దివ్యౌషధంగా భావిస్తారు. రేగుపళ్లు ఉన్నచోట క్రిమికీటకాలు దరిచేరవని ఒక నమ్మకం. ఈ పండ్ల నుంచి వచ్చే వాసన మనసు మీద ఆహ్లాదకరమైన ప్రభావం చూపిస్తుంది. భూటాన్‌లో అయితే కేవలం ఇంటిని సువాసనభరితంగా ఉంచేందుకు ఈ పళ్లను మరిగిస్తారు. రేగిపండ్లు, బంతిపూల రెక్కలు (వీటికి వాయువు లో ఉండే క్రిములను నాశనము చేసే గుణం ఉంది). చిల్లర కూడా కలిపి పిల్లల తలపైన నుండి దోసిటితో పోయాలి. చివరిగా దిష్టి తీయాలి అలా పోసే టప్పుడు ఇంటి దేవుణ్ణి స్మరించాలి చివరిగా కర్పూరంతో పిల్లలకు దిష్టి తీయాలి. పిల్లలు లేని వారు, కొత్త దంపతులు చిన్ని కృష్ణునికి బోగిపళ్ళు పోసి పూజ చేసి పిల్లలను కోరుకోవాలి. పిల్లలు పెద్దవాళ్ళు అయి ఉంటే ఆ ఇంట్లో సరదాగా భక్తిగా కూడా కృషుడి కి భోగి పళ్ళు పోసి వేడుకగా భజన చేయవచ్చు.